మునగాల, మే 20 : మోతె మండల కేంద్రంలో ఈ నెల 13న హత్యకు గురైన పగడాల జనార్దన్రెడ్డి(70)కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా మునగాల పోలీస్స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ కేసు వివరాలు వెల్లడించారు. మోతె మండల కేంద్రానికి చెందిన పగడాల జనార్దన్రెడ్డి(70), అదే గ్రామానికి చెందిన పగడాల గిరిధర్రెడ్డి దాయాదులు. కొన్నేండ్లుగా వీరి మధ్య భూమి పంచాయితీ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో గిరిధర్రెడ్డి వాటి ని మనసులో పెట్టుకుని జనార్దన్రెడ్డిని హత్య చేయించాలని నిర్ణయించుకున్నాడు. దాంతో గతంలో పరిచయం ఉన్న ప్రస్తుతం పాలకవీడు పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న తంగిరాల రాంబాబును సంప్రదించాడు. రాంబాబు సూచనతో నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొండమల్లేపల్లికి చెందిన సయ్యద్ సయీద్, సయ్యద్ నదీంను గిరిధర్రెడ్డి సంప్రదించాడు. వారితో జనార్దన్రెడ్డిని హత్య చేయడానికి రూ.10 లక్షలు సుఫారీ మాట్లాడుకున్నారు. ఇందుకు అడ్వాన్స్ గా రూ.3 లక్షలు చెల్లించడంతో ఆ డబ్బులను రాంబాబు, సయీద్, నదీం రూ.లక్ష చొప్పున పంచుకున్నారు.
అనంతరం జనార్దన్రెడ్డి హత్య చేయడానికి ఈ నెల 11,12 తేదీల్లో గ్రామంలో రెక్కీ నిర్వహించారు. 13న మధ్యాహ్నం హత్య చేయడానికి జనార్దన్రెడ్డి ఇంటికి వెళ్లగా ఆ సమయంలో అక్కడ లేడు. అదే రోజు రాత్రి జనార్దన్రెడ్డి, ఆయన భార్య పూలమ్మ, మనువడు ఉదయ్రెడ్డి ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా అర్ధరాత్రి సయీద్, నదీం జనార్దన్రెడ్డిని కత్తులతో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. అయితే గ్రామం నుంచి గిరిధర్రెడ్డి పరార్ కావడంతో అనుమానం కలిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన గిరిధర్రెడ్డి ఉద్యోగరీత్యా తుంగతుర్తి మండలం బండరామారం ఎక్స్రోడ్డులో ఓ ఇంట్లో సయీద్, నదీం, రాంబాబు ఉన్నట్లు గుర్తించారు. అదుపులోనికి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు.
అమెజాన్లో కత్తుల కొనుగోలు
హత్యకు ఉపయోగించిన రెండు బైక్లు, మూడు కత్తులు, నాలుగు సెల్ఫోన్లు సీజ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. గతంలో గిరిధర్రెడ్డిపై రెండు హత్యకేసులు నమోదైనట్లు చెప్పారు. హత్యకు ఉపయోగించిన కత్తులను అమెజాన్ ద్వారా కొనుగోలు చేసినట్లు తెలిపారు. కేసు చాకచాక్యంగా ఛేదించిన మునగాల సీఐ ఆంజనేయులు, కానిస్టేబుళ్లు ఉమామహేశ్వర్రావు, పి.భాస్కర్ను ఎస్పీ అభినందించారు. సీఐ ఆంజనేయులు, మోతె ఎస్ఐ ప్రవీణ్కుమార్కు రివార్డులు అందజేస్తామని తెలిపారు. సమావేశంలో డీఎస్పీ రఘు, ఎస్బీ సీఐ టి.శ్రీనివాస్, మునగాల, కోదాడ రూరల్ సీఐ ప్రసాద్, ఎస్ఐలు బాలూనాయక్, ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు.