రాష్ట్ర వ్యాప్తంగా 445 ఖాళీలకు నోటిఫికేషన్
విడుదల చేసిన టెస్కాబ్స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా నిబంధనలు
ఈ నెల 19 నుంచి దరఖాస్తులు షురూ..
మార్చి 3 వరకు స్వీకరణ ఇక సహకార బ్యాంకుల్లో మెరుగైన సేవలు
నల్లగొండ, ఫిబ్రవరి 27;ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సర్కారు దృష్టి సారించింది. పలు శాఖల్లో దశల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నది. తాజాగా సహకార శాఖలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది సహకార కేంద్ర బ్యాంకుల్లో 445 పోస్టులను గుర్తించగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 36 పోస్టులు ఉన్నాయి. అందులో 10 పోస్టులు అసిస్టెంట్ మేనేజర్, 26 స్టాఫ్ మేనేజర్ పోస్టులు. రాష్ట్ర స్థాయిలో ప్రిలిమినరీతోపాటు మెయిన్ పరీక్షలు నిర్వహించి పోస్టింగ్స్ ఇవ్వనున్నారు. ఉద్యోగాల భర్తీతో రైతులు, వృత్తిదారులకు ఇక మెరుగైన సేవలు అందనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తొమ్మిది సహకార కేంద్ర బ్యాంకుల్లో 445 పోస్టులు ఉండగా వాటిలో 36 ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఉన్నట్లు గుర్తించిన టెస్కాబ్ భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో 10 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు కాగా 26 స్టాఫ్ మేనేజర్ పోస్టులు. రాష్ట్రస్థ్దాయిలో అన్ని ఖాళీలకు ఒకేసారి పరీక్ష నిర్వహించి ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం ఈ నెల 19న నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే నెల 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తులకు అవకాశం ఉంది. ఏప్రిల్ 4న ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. అనంతరం మెయిన్స్ నిర్వహించి మెరిట్, రోస్టర్ ప్రకారం ఉద్యోగార్థులను ఎంపిక చేస్తారు.
టీఆర్ఎస్ పాలనలో పారదర్శకంగా సేవలు..
2014కు ముందు సహకార సొసైటీలకు నిధులు వస్తే డైరెక్టర్లు, చైర్మన్లు లేదంటే వారి బంధువులే రుణాలు తీసుకునే పరిస్థితి ఉండేది. ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి పూర్తిగా మారింది. రైతులకు పారదర్శకంగా రుణాలు అందిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఏడు వందల కోట్ల టర్నోవర్ ఉన్న డీసీసీసీ ప్రస్తుతం 1700 కోట్లకు పెరిగింది. ఉమ్మడి జిల్లాలోని 1.7 లక్షల మంది రైతులకు రూ.1100 కోట్ల రుణాలు ఇచ్చారు. ఐదారేండ్లతో పోలిస్తే బంగారు రుణాలు రూ.80 కోట్ల నుంచి రూ.220 కోట్లకు, పంట రుణాలు రూ.150 కోట్ల నుంచి రూ.450 కోట్లకు, ఎల్టీ రుణాలు రూ.20 కోట్ల నుంచి రూ.150 కోట్లు పెరిగాయి. మూడేండ్ల క్రితం బ్యాంకు లావాదేవీలను ప్రభుత్వం పూరిస్థ్దాయిలో ఆన్లైన్ చేసింది. ప్రతి రైతుకు ఏటీఎం కార్డు ఇచ్చి జిల్లాకో మొబైల్ ఏటీఎం వాహనాన్ని సైతం అందుబాటులోకి తెచ్చింది. గ్రామాల్లో రైతులకు మొబైల్ ఏటీఎం సేవలపై అవగాహన కల్పించి వాణిజ్య బ్యాంకులకు మించి సేవలు అందిస్తుంది సహకార శాఖ. ఈ సేవలు మరింత విస్తరించేందుకు టెస్కాబ్ ద్వారా బ్యాంకు సేవలను విస్తరించడంతోపాటు ఉద్యోగుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నది.
బ్యాంకుల విస్తరణ కోసమే..
రాష్ట్రంలోని 9 డీసీసీబీలను బలోపేతం చేసి రైతాంగానికి చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నాబార్డ్ నుంచి ఇటీవల సమృద్ధ్ది నిధులు కేటాయించింది. సహకార సేవలను మరింత విస్తృతం చేయాలనే లక్ష్యంతో బ్యాంకుల విస్తరణ సైతం చేపడుతున్నది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30 బ్యాంకులు ఉండగా.. త్వరలో మరో 10 కొత్తవి ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. వాటిలో స్టాఫ్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ మేనేజర్ల పోస్టులు అవసరం ఉండడంతో ముందుస్తు నియామకాలు చేపడుతున్నది. దీంతో రానున్న రోజుల్లో సహకార సేవలు రైతులకు మరింత చేరువ కానున్నాయి.
సహకార సేవలు విస్తరించాలన్నదే లక్ష్యం
సమైక్య పాలనలో సహకార సొసైటీలు, బ్యాంకుల పరిస్థ్దితి దారణంగా ఉండేది. రైతు శ్రేయస్సు కోసం ఏర్పడ్డ ఇవి కాలానుగుణంగా వారి ఆదరణ కోల్పోయాయి. ఈ బ్యాంకులు నిర్వీర్యం కావద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తున్నది. నిధుల కేటాయింపు పెరుగడంతో పంట రుణాలు, ఎల్టీ, పౌల్ట్రీ, పాడి పరిశ్రమతోపాటు రైతుల పిల్లలకు విద్యారుణాలు అందిస్తున్నాం. సేవలను మరింత విస్తరించేందుకు కొత్త బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నాం. ఉద్యోగుల కొరత రావద్దనే ఉద్దేశంతో పోస్టుల భర్తీ చేస్తున్నాం.
– గొంగిడి మహేందర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్, నల్లగొండ