నల్లగొండ, ఫిబ్రవరి 21: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జనాభా అవసరాలకు అనుగుణంగా పాల ఉత్పత్తి లేకపోవడంతో పాల ప్యాకెట్లపై ఆధారపడాల్సి వస్తున్నది. దాంతో పాడి రంగానికి చేయూతనివ్వడానికి మేలు జాతి పశువుల ఉత్పత్తి పై ప్రభుత్వం దృష్టి సారించింది . ఇందులో భాగంగా జాతీయ కృత్రిమ గర్భధారణ పథకం పశువులకు కృత్రిమ గర్భధారణ చేసేందుకు గతేడాది ఆగస్టు ఒకటి నుంచి ఈ ఏడాది మే వరకు ఉచిత ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. సాధారణ సమయంలోనూ కృత్రిమ గర్భధారణ జరుగుతున్నా గోపాలమిత్రలు నామినల్గా పాడి రైతు నుంచి రూ.130 వసూలు చేస్తారు. మేలు జాతి పశువుల వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేస్తే మేలు జాతి దూడలు పుట్టి పాల ఉత్పత్పి పెరుగుతుందన్న ఉద్దేశంతో సర్కారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెండేండ్లుగా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
తొలిసారి 2019-20లో 75 వేల పశువులకు కృత్రిమ గర్భధారణ చేయగా 23 వేల దూడలు పుట్టాయి. రెండోసారి 2020-21లో 1.79 లక్షల పశువులకు గర్భధారణ చేయగా 1.11 లక్షల దూడలు జన్మించాయి. కాగా ఈ ఏడాది 2.12 లక్షల పశువులకు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో సూర్యాపేటలో 79,005 పశువులకు, నల్లగొండలో 71 317, యాదాద్రి భువనగిరిలో 62 011 పశువులకు కృత్రిమ గర్భధారణ చేయాలని ప్రభుత్వం జిల్లా పశుగణాభివృద్ధ్ది సంస్థ్దకు లక్ష్యాన్ని విధించింది. మే 2022 నాటికి జిల్లాలోని 248గోపాల మిత్రలు, 74మంది మైత్రీలు ఈ లక్ష్యాన్ని పూర్తి చేయాలని నిర్దేశించుకొని.. ఈ ఏడాది జనవరి తొలివారం నాటికే పూర్తి చేసి నల్లగొండ జిల్లాను రాష్ట్రంలో తొలిస్థానంలో నిలిపారు.
పాడి సంపద.. పాల ఉత్పత్తి పెంపు కోసమే…
ఉమ్మడి జిల్లాలో 36 లక్షల కుటుంబాలు ఉన్నట్లు సమగ్ర సర్వే నివేదిక స్పష్టం చేస్తున్నది. ప్రతి కుటుంబానికి పాలు అవసరమే. పేద మధ్య తరగతి మినహాయిస్తే మిగిలిన వారి ఇండ్లలో పాల వినియోగం బాగా ఉంటుంది. ప్రతి మనిషి ఆరోగ్య రీత్యా రోజు కనీసం పావు లీటర్ పాలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో 14,05,588 తెల్ల , నల్ల పశువులు ఉండగా అందులో 5.58 లక్షల పశువులు సగటున రోజు 4 లీటర్ల చొప్పున పాలు ఇస్తుండగా దాదాపు 22.34 లక్షల లీటర్ల పాల దిగుబడి వస్తున్నది. ఇందులో డెయిరీలకు విక్రయానికి మినహాయిస్తే 15 లక్షల లీటర్ల మిగిలి ఉంటుందని పశు సంవర్థ్దక శాఖ అంచనా. జిల్లాలోని 36 లక్షల కుటుంబాలు రోజుకు లీటర్ పాల చొప్పున వినియోగించుకున్నా 36 లక్షల లీటర్లు అవసరం. లోటు కారణంగా పలు సంస్థలు నిత్యం 20 లక్షల లీటర్ల పాలు విక్రయిస్తున్నాయి.
పెరుగునున్న సంకర జాతి పశువులు..
రెండు దశాబ్దాల క్రితం దేశవాలీ పశువులే ఇంటింటికీ ఉండేవి. కాలానుగుణంగా వ్యవసాయంలో యాంత్రీకరణ పెరుగడంతో వాటి అవసరం తగ్గినా.. పాల అవసరం మాత్రం క్రమంగా పెరుగుతున్నది. దాంతో మల్లీ పశువుల పెంపకంపై పాడి రైతులు దృష్టి సారించారు. దేశవాలీ పశువుల (ఆవులు, గేదెలు) ద్వారా పాల దిగుబడి తక్కువగా వస్తుండడంతో హర్యానా, ముర్రా, ఒంగోలు గిత్త, జెర్సీ జాతి పశువుల పెంపకంపై దృష్టి సారించారు. ఇక్కడి వాతావరణానికి అవి బతికే పరిస్థితి లేకపోవడంతో వాటి సెమన్ (వీర్యాన్ని) దేశవాలీ ఆవులు, బర్రెలకు ఎక్కించి మేలు జాతి దూడలు జన్మించేలా సర్కారు ఏర్పాట్లు చేసింది. ఈ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించి డీఎల్డీఏకు యేటా లక్ష్యాన్ని సైతం నిర్దేశించి జిల్లాలో కృతిమ గర్భధారణ పెంచి సంకరజాతి పశువుల ఉత్పత్తి (దేశవాలీ ఆవులకు ఏఐ చేస్తే పుట్టే దూడలు) పెరిగింది. ఈ పద్ధ్దతి ద్వారా రెండేండ్ల్ల క్రితం 79వేల పశువులకు గర్భదారణ చేయగా 23 వేల మేలు రకం దూడలు పుట్టాయి. గతేడాది 1.79 లక్షల పశువులకు చేస్తే 1.11లక్షల దూడలు పుట్టడంతో ప్రభుత్వం ఈసారి ఉమ్మడి జిల్లాకు 2.12 లక్షల కృత్రిమ గర్భదారణ లక్ష్యాన్ని విధించింది. ఈ లక్ష్యాన్ని సిబ్బంది గడువులోపే పూర్తి చేశారు. గడిచిన రెండేండ్లలో కృత్రిమ గర్భదారణతో ఉమ్మడి జిల్లాలో 1.34 లక్షల ఆడ దూడలు జన్మించాయి. ఈ సారి మరో 1.5 లక్షల దూడలు పుట్టే అవకాశం ఉన్నట్లు పశుగణాభివృద్ధి అధికారులు అంచనా వేస్తున్నారు.
పాల దిగుబడి పెంచేందుకు చర్యలు
జిల్లా వ్యాప్తంగా పాల ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం మేలైన పశువులను ఉత్పత్తి చేసేందుకు కృత్రిమ గర్భధారణ చేపట్టాలని ప్రభుత్వం పశుగణాభివృద్ధి సంస్థను ఆదేశించింది. ఈ ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2.12 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ చేయాలని లక్ష్యాన్ని విధించింది. ఇందుకు అవసరమైన ఆర్టిఫిషియల్ సెమన్ (వీర్యం) అందుబాటులోకి తీసుకొచ్చి వచ్చే మే నాటికి లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉన్నా ముందే పూర్తి చేశాం. సాధారణ రోజుల్లో పశువులకు కృత్రిమ గర్భధారణ చేస్తే ప్రతి పశువుకు రూ.130 తీసుకుంటాం. ఈ ప్రత్యేక డ్రైవ్లో ఉచితంగా నిర్వహించాం.
-మోతె పిచ్చిరెడ్డి, పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా