పెద్దవూర, ఫిబ్రవరి 22: విద్యార్థులంతా ఆంగ్ల విద్య కోసం ప్రైవేటు బాట పట్టడంతో ఆ పాఠశాల మూతపడింది. తిరిగి నాలుగేండ్ల తర్వాత బదిలీపై వచ్చిన ఓ ఉపాధ్యాయుడు ఆంగ్ల విద్యకు హామీ ఇస్తూ తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించడంతో ఎట్టకేలకు తెరుచుకున్నది. జీరో అడ్మిషన్ల నుంచి 18మందితో తరగతులు పునఃప్రారంభమై విద్యార్థులతో కళకళలాడుతున్నది.. పెద్దవూర మండలంలోని చింతపల్లి తండా ప్రాథమిక పాఠశాల.
చింతపల్లి తండాలోని ప్రాథమిక పాఠశాల 2018 సంవత్సరంలో జీరో ఎన్రోల్ మెంట్ కింద నమోదు కావడంతో మూతపడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన 317 జీఓ ప్రకారం ఓ ఉపాధ్యాయుడు గద్దల చంద్రశేఖర్ బదిలీపై ఇక్కడకు రావడంతో పాఠశాల దశ మారింది. తండాకు రాగానే ప్రజాప్రతినిధులను, గ్రామంలో విద్యావంతులను కలుసుకుని పాఠశాల పునఃప్రారంభానికి చొరవ తీసుకున్నారు. తల్లిదండ్రులను నేరుగా కలిసి ఆంగ్ల మాధ్యమం ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. వేలకు వేలు ఖర్చు చేసి ప్రైవేటు పాఠశాలకు పంపించాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. దాంతో 1వ తరగతిలో 8మంది, 3వ తరగతిలో 8మంది, 5వ తరగతిలో ఇద్దరు చొప్పున మొత్తం 18మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారు. వారందరికీ ఉచితంగా యూనిఫాం, దుస్తులు అందించడంతో పాటు పాఠశాలకు రంగులు వేసి ముస్తాబు చేశారు. దాంతో ఆ పాఠశాలలో విద్యార్థుల సందడి అంతా ఇంతా కాదు.
పూర్తి ఉచితంగా ఆంగ్ల విద్య..
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎలాంటి ఖర్చు లేకుండా ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తున్నది. యూనిఫాం, మధ్యాహ్న భోజనంతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నది. ఇక్కడికి బదిలీపై వచ్చిన నేను పాఠశాలలో సదుపాయాలు, విద్యా బోధనపై తండా వాసులకు అవగాహన కల్పించడంతో 18మంది అడ్మిషన్ తీసుకున్నారు. నాలుగేండ్ల తర్వాత పాఠశాలను పునఃప్రారంభించడం సంతోషంగా ఉంది.
– గద్దల చంద్రశేఖర్, ప్రధానోపాధ్యాయుడు
చాలా సంతోషంగా ఉంది..
నాలుగు సంవత్సరాలుగా మూతబడిన పాఠశాలను ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్ కృషితో పునఃప్రారంభించడం అనందంగా ఉంది. మారుమూల బడిలోకూడా నాణ్యమైన విద్యను బోధిస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యానికి తోడు స్థానికుల సహకారంతో మళ్లీ మా ఊరి బడి కళకళలాడుతున్నందుకు సంతోషంగా ఉంది.
– సుంకిరెడ్డి ప్రభావతి, సర్పంచ్