యాదాద్రి, ఫిబ్రవరి3 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో గురువారం నిత్యపూజల కోలాహల నెలకొంది. తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఆలయ మండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణం జరిపించారు. కొండపైన ఉన్న పర్వతవర్దిని రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన చేశారు. ఆలయ పుష్కరిణి చెంత భక్తులు పుణ్యస్నానం ఆచరించి సంకల్పంలో పాల్గొన్నారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చనలు చేశారు. సత్యనారాయణ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీవారి ఖజానాకు రూ.10,53,897 వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా లక్ష్మీనరసింహ స్వామి విమాన గోపురం స్వర్ణతాపడానికి రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్ధిపేట నియోజకవర్గం తరపున కిలో బంగారాన్ని ఆలయ ఈఓ ఎన్.గీతకు అందించారు. అంతకుముందు ఆయన సతీమణితో పాటు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, సిద్ధిపేట ప్రజాప్రతినిధులతో కలిసి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు మోహనాచార్యులు, ఆలయ అధికారులు మంత్రికి సంప్రదాయ స్వాగతం పలికారు. అనంతరం బాలాలయంలో సువర్ణ పుష్పార్చనలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బాలాలయ ముఖ మండపంలో మంత్రి దంపతులు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డికి వేదాశీర్వచనం ఇవ్వగా, ఆలయ ఈఓ ఎన్.గీత స్వామివారి ప్రసాదం అందించారు. అష్టోత్తర పూజల్లో పాల్గొన్న మంత్రి కిలో విలువైన బంగారు బిస్కెట్లను ఈఓకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ కొద్దిరోజుల్లో సిద్ధిపేట నియోజకవర్గం తరపున మరో కిలో బంగారాన్ని అందిస్తామన్నారు. స్వర్ణతాపడానికి విరాళాలు వెల్లువలా వస్తున్నాయన్నారు.
ఇప్పటికే 35కిలోల బంగారం విరాళంగా రాగా, మరో 45 కిలోల బంగారం ఇచ్చేందుకు దాతలు ముందుకు వస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ఆర్డీఓ భూపాల్రెడ్డి, జిల్లా కోశాధికారి సురేశ్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటయ్య, జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, ఆలయ ఏఈఓలు గట్టు శ్రవణ్కుమార్ పాల్గొన్నారు.