‘ప్రభుత్వం పాలసీలను మాత్రమే తీసుకొస్తుంది. వాటిని అమలు చేసి కార్యరూపంలోకి తీసుకురావాల్సింది అధికారులే. రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టించడంలో సమర్థవంతమైన అధికారుల పాత్ర కీలకం. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి చిత్తశుద్ధి గల ఆఫీసర్లు తోడవడంతో 80 సంవత్సరాల అభివృద్ధి ఎనిమిదేండ్లలోనే సాధ్యమైంది’అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి బదిలీపై వెళ్తున్న సందర్భంగా సూర్యాపేట జిల్లాకేంద్రంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట మున్సిపాలిటీకి రామానుజులరెడ్డి అందించిన సేవలను అభినందించారు.
బొడ్రాయిబజార్, మే 19 : ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులను కార్యరూపంలోకి తీసుకు రావాల్సింది అధికారులేనని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మూడేండ్ల మూడు నెలలపాటు సూర్యాపేట మున్సిపల్ కమిషనర్గా సేవలు అందించిన పి.రామానుజులరెడ్డి బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాప్రతినిధులు చెబితే వినే అధికారి కాకుండా స్వతహాగా పని చేసే అధికారిగా ఉండాలన్నారు.
ప్రతి ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో చేరితే 40 ఏండ్లపాటు ఉంటారని, వారి నుంచి మనం ఎంతో నేర్చుకోవాలని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే ప్రతి పని అమలు కావాలంటే నిజాయితీ కలిగిన అధికారులే కావాలన్నారు. కొందరు అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తారని, తాము చేసే ప్రతి పనిలో లీనమవుతారని, అలాంటి అధికారే రామానుజులరెడ్డి అని తెలిపారు. చిత్తశుద్ధితో పని చేసే అధికారులు ఉన్నారు కాబట్టే తెలంగాణ ఎనిమిది సంవత్సరాల్లో 80 ఏండ్ల అభివృద్ధిని సాధించిందన్నారు. 2014కు ముందు ప్రతి వేసవిలో సూర్యాపేటలో నీటి కోసం మహిళలు కొట్టుకొని స్టేషన్కు వచ్చే వారని, ప్రస్తుతం గుజరాత్లో ఆ పరిస్థితి ఉందన్నారు.
‘కేవలం ఎనిమిదేండ్లలో సమస్యలు ఎలా మాయమైనాయి.. సమస్యలు మంత్రమేస్తే పోతాయా.. కేసీఆర్ గురించి మాట్లాడే అక్షరం రాని అజ్ఞానులు సమాధానం చెబుతారా.. నేడు గుజరాత్లో ఎందుకు నీళ్ల కోసం కొట్లాడుకుంటున్నారో, తెలంగాణాలో ఎందుకు లేదు.. దేశంలో ఎందుకు పవర్ హాలిడేస్ జరుగుతున్నాయి.. ఎందుకు ఏ రాష్ట్రంలో రైతులకు 6 గంటలకు మించి కరెంట్ ఇవ్వడం లేదు.. ఒక్క తెలంగాణాలో తప్ప అనే ప్రశ్నకు సమాధానం కేసీఆర్’ అని మంత్రి అన్నారు. కేసీఆర్ చేసే పనిలో సగం చేసినా దేశం ఈ దుస్థితిలో ఉండదని చెప్పారు. చెత్త నిర్వహణలో సూర్యాపేట దేశానికి ఆదర్శమని, మంచి అధికారితోపాటు చైర్మన్, పాలకవర్గం సహకారం ఉంటే మంచి ఫలితాలే వస్తాయని తెలిపారు.
రోడ్ల వెడల్పు మిగతా అన్ని ప్రాంతాల్లో సాధారణ విషయమే అయినా సూర్యాపేటలో మాత్రం ఒక చరిత్ర అన్నారు. రోడ్డు వెడల్పు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి పాత్ర కీలకమన్నారు. సూర్యాపేట జిల్లా ఆసుపత్రికి దేశవ్యాప్తంగా గొప్ప పేరు వచ్చిందంటే అందులో మున్సిపాలిటీ పాత్ర కూడా ఉందని చెప్పారు. తాను తెచ్చిన నిధులను కూడా సరైన పద్ధతుల్లో సద్వినియోగం చేసి సమయానికి పనులు చేయడంతోనే మంచి పేరు వస్తున్నదన్నారు. అనంతరం రామానుజులరెడ్డిని మంత్రి జగదీశ్రెడ్డి, మున్సిపల్ పాలకవర్గం, అధికారులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలితాదేవి ఆనంద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, బ్రాండ్ అంబాసిడర్ పెద్దిరెడ్డి గణేశ్, జడ్పీటీసీ జీడి భిక్షం, నాయకులు పెద్దిరెడ్డి రాజా, జనరల్ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ మురళీధర్రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.