రామన్నపేట, మే19 : పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని కక్కిరేణి గ్రామంలో రూ.30లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను గురువారం ఆయన ప్రారంభించారు. నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని సందర్శించి 30 మందికి ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం తన సొంత నిధులతో వారికి 30 కుర్చీలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు డప్పు చప్పుళ్లతో మహిళలు కోలాటాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మండల కేంద్రంలోని మల్లికార్జున ఫంక్షన్హాల్లో 82 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులు, 25 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రైతులు, పేదల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేని కాంగ్రెస్, బీజేపీ నాయకులు అబద్ధాలను ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని, ప్రజలు మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలబడాలని కోరారు.
కక్కిరేణి గ్రామంలో పెండింగ్లో ఉన్న బ్రిడ్జిల పనులను పూర్తి చేయిస్తానని, మరో రూ.10 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రేనేజీ నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, సింగిల్విండో చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, తాసీల్దార్ ఆంజనేయులు, మార్కెట్ వైస్చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు మందడి ఉదయ్రెడ్డి, పోచబోయిన మల్లేశం, సర్పంచులు పిట్ట కృష్ణరెడ్డి, ఎడ్ల మహేందర్రెడ్డి, అప్పం లక్ష్మీనర్సు, మెట్టు మహేందర్రెడ్డి, రేఖ యాదయ్య, బొక్క యాదిరెడ్డి, కోళ్ల స్వామి, బందెల యాదయ్య, నీల జయలక్ష్మి, కడమంచి సంధ్య, ముత్యాల సుజాత, ఎంపీటీసీలు గొరిగె నర్సింహ, దోమల సతీశ్, గాదె పారిజాత, ఏనుగు పుష్ప, బడుగు రమేశ్, ఎండీ ఆమేర్, ముప్పిడి దయాకర్, పోతరాజు సాయికుమార్, బొడ్డు ఎల్లయ్య, గుండు రమేశ్ పాల్గొన్నారు.