నల్లగొండ ప్రతినిధి, మే19(నమస్తే తెలంగాణ) : అభివృద్ధిలో నల్లగొండ రూపురేఖలు మార్చాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్రధాన రహదారులు, జంక్షన్ల విస్తరణ, పార్కుల ఆధునీకరణ, సమీకృత మార్కెట్ల నిర్మాణాలు, కళాభారతి, ట్యాంకుబండ్, హెలిప్యాడ్ నిర్మాణం లాంటి అనేక పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో సంబంధిత శాఖల ఆధ్వర్యంలో ఈ పనులన్నీ కార్యరూపం దాల్చాయి.
పనుల పురోగతిపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండగా మంత్రి జగదీశ్రెడ్డి క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ చకచకా కొనసాగేలా చర్యలు చేపడుతున్నారు. ఈ నెల 14న కేటీఆర్ హాలియాకు వచ్చిన సందర్భంగా నల్లగొండ పనుల పురోగతిపై సమీక్షించి తగిన ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, కమిషనర్ రమణాచారి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి నిత్యం అభివృద్ధి పనులు పర్యవేక్షిస్తున్నారు.
సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో పనుల ఆమోదానికి, నిధుల మంజూరుకు ఎక్కడా ఆటంకాలు లేవు. దీంతో అన్ని పనులను ఏకకాలంలో కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏప్రిల్ 28న సీఎం కేసీఆర్ నార్కట్పల్లికి వచ్చిన సందర్భంగా సమీక్షిస్తూ మరికొన్నింటిపై హామీలిచ్చిన విషయం తెలిసిందే. వీటిల్లో కీలకమైన నార్కట్పల్లి-అద్దంకి రహదారిపై మర్రిగూడ బైపాస్ వద్ద రూ.45కోట్లతో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి పక్షం రోజుల క్రితమే పరిపాలన ఆమోదం లభించింది. మిగిలిన వాటిల్లో మరో రెండింటికి ఆమోదం తెలిపారు.
నల్లగొండ నడిబొడ్డున క్లాక్టవర్ సెంటర్కు ఆనుకుని ఉన్న ప్రస్తుత ఆర్అండ్బీ అతిథి గృహం స్థానంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన విశాలమైన గెస్ట్హౌస్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. రూ.6.25కోట్లతో ఆరు సూట్ రూమ్స్, ఇతర సౌకర్యాలతో బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేపట్టనున్నారు. పట్టణ నడిబొడ్డున ఈ అతిథి గృహ నిర్మాణంతో క్లాక్టవర్ సెంటర్ మరింత సుందరంగా కనిపించనుంది. ఇప్పటికే అక్కడ జంక్షన్ విస్తరణ పనులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇదే ప్రాంతంలో మరోవైపు ఉన్న ఆర్అండ్బీ జిల్లా కార్యాలయాన్ని అక్కడి నుంచి తొలిగించిన విషయం తెలిసిందే. నల్లగొండ కళాభారతి నిర్మాణానికి ఈ స్థలం కేటాయించారు. దీంతో నూతనంగా ఆర్అండ్బీ కార్యాలయ సముదాయాన్ని నిర్మించేందుకు కలెక్టరేట్ ఆవరణలో ఖాళీ స్థలాన్ని కేటాయించారు. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ రూ.6కోట్ల నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఎస్ఎల్బీసీలో ఇరిగేషన్ శాఖ జిల్లా కార్యాలయానికి సైతం పరిపాలన అనుమతులు రానున్నట్లు తెలిసింది. దీంతో సీఎం కేసీఆర్ ఏప్రిల్లో ప్రకటించిన విధంగా హామీలన్నీ కార్యరూపం దాలుస్తున్నాయి.
నల్లగొండను సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పానికి ప్రత్యేక కృతజ్ఞతలు. పట్టణ ప్రజలు కలలో ఊహించని విధంగా అభివృద్ధి పనులు మంజూరు చేస్తున్నారు. ఎక్కడా జాప్యం లేకుండా వెంటవెంటనే అనుమతులిస్తూ నిధులు కేటాయిస్తున్నారు. యువనేత కేటీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి నిత్యం సమీక్షిస్తూ తగిన ఆదేశాలు ఇస్తున్నారు. వీటిన్నింటినీ నాణ్యతతో వేగంగా పూర్తికి చర్యలు తీసుకుంటున్నాం.
– కంచర్ల భూపాల్రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే