వానకాలం సీజన్ పంటల సాగుకు సంబంధించి జిల్లా వ్యవసాయ శాఖ సిద్ధమైంది. అవసరం మేరకు
ఎరువులు, విత్తనాలు సమకూర్చేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నది. ఈసారి 4,75,280 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయన్నది అంచనా. మార్కెట్లో తెల్లబంగారం ధర బాగుండడంతో పత్తి వేసేందుకు
ఎక్కువమంది రైతులు ఆసక్తి చూపుతున్నారు. అత్యధికంగా 2,17,800 ఎకరాల్లో పత్తి సాగు చేసే అవకాశం ఉన్నట్లు చెప్తున్న అధికారులు.. 4,35,600 ప్యాకెట్ల పత్తి విత్తనాలు అవసరం అవుతాయని భావిస్తున్నారు. వాటితోపాటు కంది, పెసర, మినుము, మొక్కజొన్న, నువ్వులు తదితర పంటలకు కలిపి 46,452 క్వింటాళ్ల విత్తనాలు, 83,497 మెట్రిక్ టన్నుల ఎరువులు సమకూర్చుకోవాల్సి ఉంది. ఆ మేరకు రైతులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా వ్యవసాయ శాఖ ముందస్తు చర్యలు తీసుకుంటున్నది.
యాదాద్రి భువనగిరి, మే 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వానకాలం సాగుపై వ్యవసాయాధికారులు దృష్టిపెట్టారు. జిల్లాలో సాగు అంచనా వేసి అవసరమైన ఎరువులు, విత్తనాల కోసం ప్రణాళికలు సిద్ధ్దం చేస్తున్నారు. ఈ నెల 25 నుంచి రోహిణి కార్తె మొదలు కానుండగా..రైతులు సాగు పనుల్లో నిమగ్నం కానున్నారు. ఇప్పటికే పలు చోట్ల దుక్కులు దున్నుతున్నారు. ముఖ్యంగా మొదటి వానకే విత్తనాలను వేసుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
వానకాలంలో జిల్లా వ్యాప్తంగా 4,75,280 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తారని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. దీనికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధ్దం చేశారు. ఇందులో అత్యధికంగా పత్తి 2,17,800 ఎకరాల్లో, వరి 1,72,500 , కందులు 60,800 ఎకరాల్లో సాగు చేయనున్నారు. ఉద్యాన పంటలను 19,950 ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
జిల్లాలో మొత్తం 4,75,280 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉండడంతో అందుకనుగుణంగా 46,452 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచనున్నారు. 4,35,600 పత్తి ప్యాకెట్లను అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయ శాఖ అధికారులకు నివేదిక పంపించారు. అలాగే 83,497 మెట్రిక్ టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలు రకాల విత్తనాలను, ఎరువుల నిల్వలను అందుబాటులో ఉంచగా..రానున్న రోజుల్లో ఎటువంటి కొరత లేకుండా చూస్తామని జిల్లా అధికారులు చెబుతున్నారు.
ఎరువులు కావాల్సినవి (మెట్రిక్ టన్నులు)
యూరియా 36,530
డీఏపీ 15,054
ఎంఓపీ 6,021
కాంప్లెక్స్ 24,086
ఎస్ఎస్పీ 1,806
మొత్తం 83,497