భువనగిరి కలెక్టరేట్, మే 19 : గ్రామీణ క్రీడా ప్రాంగణాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలకు అనువైన స్థలాల సేకరణను రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి రెవెన్యూ, పంచాయతీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఆమె తాసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, ఉపాధి హామీ అధికారులతో గ్రామీణ క్రీడా ప్రాంగణాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాట్లపై సమీక్షించారు. గ్రామీణ క్రీడా ప్రాంగణాల కోసం ఎకరం లేదా ఎకరన్నర స్థలం సేకరించాలన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటులో భాగంగా 85కు గాను ఇప్పటి వరకు 30స్థలాల సేకరణ పూర్తయ్యిందని, మిగిలిన 55స్థలాల సేకరణ రెండు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు.
మన ఊరు మన బడి కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను మమేకం చేసి క్షేత్రస్థాయిలో పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాట్లకు చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి కూలీల సంఖ్య పెంచాలన్నారు. గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. 8వ విడుత హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు గుర్తించిన స్థలాల్లో గుంతలు తీసి, అవెన్యూ ప్లాంటేషన్లో మల్టీలేయర్ మూడు వరుసల్లో మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలన్నారు.
జిల్లాలో 28లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. గ్రామాల్లో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లను పూర్తి స్థాయిల్లో వినియోగించుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీల్లో ఆదాయాలు పెంచుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు దీపక్తివారీ, డి.శ్రీనివాస్రెడ్డి, జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీఆర్డీఓ ఉపేందర్రెడ్డి, డీపీఓ సునంద, అడిషనల్ డీఆర్డీఓ పాల్గొన్నారు.