రోడ్డు సేఫ్టీ బిల్లు పేరుతో భారీ చలాన్లు వేస్తూ రవాణా రంగాన్ని కుదేలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై కార్మిక లోకం భగ్గుమన్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా లారీ, ఆటో, క్యాబ్ యజమానులు, డ్రైవర్లు గురువారం బంద్ నిర్వహించారు. ఏ ఒక్క పట్టణంలోనూ వాహనాలను రోడ్డెక్కించలేదు. ఒక్క మిర్యాలగూడలోనే లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 650లారీలు నిలిచిపోయాయి. రవాణా స్తంభించిపోవడంతో వాహనదారులు, సరుకు రవాణాదారులు ఇబ్బందులు పడ్డారు. కార్మికుల ఆందోళనకు టీఆర్ఎస్కేవీతోపాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు మద్దతుగా నిలిచారు.
– మిర్యాలగూడ, మే 19
నమస్తే తెలంగాణ నెట్ వర్క్ : ఆటో, క్యాబ్, లారీల ఫిట్నెస్ రెన్యువల్పై ఆలస్య రుసుం రోజుకు రూ.50 చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ట్రాన్స్పోర్టు యూనియన్ జేఏసీ పిలుపు మేరకు కార్మికులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
సూర్యాపేట, నేరేడుచర్ల, హుజూర్నగర్, కోదాడ, తుంగతుర్తిల్లో టీఆర్ఎస్కేవీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, ఇఫ్టూ సంఘాల ఆధ్వర్యంలో వాహనాలతో ధర్నా, ర్యాలీలు నిర్వహించారు. నల్లగొండ జిల్లాలో నందికొండ పైలాన్కాలనీ, మిర్యాలగూడ ట్రేడ్యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. శాలిగౌరారం మండల కేంద్రంలో టీఆర్ఎస్కేవీ, ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.