రైతును లాభాల బాటలో నడిపించేందుకు ఇతర పంటలపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పామ్ సాగును ప్రోత్సహిస్తున్నది. ఉమ్మడి జిల్లా నేలలు అనుకూలంగా ఉండడంతో సాగు విస్తీర్ణం పెంచే దిశగా చర్యలు చేపడుతున్నది. సోమవారం సూర్యాపేటలో జరిగిన సమీక్షలోనూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఇదే విషయాన్ని స్పష్టంచేశారు. ప్రపంచ మార్కెట్లో ఆయిల్కు ఉన్న డిమాండ్ నేపథ్యంలో రైతులను ఆ దిశగా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో 1,578 ఎకరాలు, సూర్యాపేటలో 561 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగవుతుండగా, ఈ ఏడాది రెండు జిల్లాల్లో కలిపి ప్రభుత్వం 15,500 ఎకరాల లక్ష్యాన్ని ఉద్యానవన శాఖ ముందుంచింది. రైతులను ప్రోత్సహించేందుకు ఇప్పటివరకు హెక్టారుకు రూ.37వేలుగా ఉన్న సబ్సిడీని తాజాగా రూ.55వేలకు పెంచింది. ఎస్సీ, ఎస్టీ రైతులకు నూరు శాతం, సన్న, చిన్నకారు రైతులకు 90శాతం రాయితీతో డ్రిప్ సౌకర్యాన్ని కూడా ప్రకటించింది.
నల్లగొండ, మే 16 (నమస్తే తెలంగాణ) : ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఆయిల్పామ్ సాగుకు భూములు అనుకూలంగా ఉండటంతో ఆ దిశగా సాగును పెంచే చర్యలకు ఉపక్రమించింది. రానున్న రోజుల్లో ప్రధానంగా పప్పు దినుసులతో పాటు నూనె గింజలకు సంబంధించిన పంటలు.. అందునా రైతులకు ఎక్కువగా లాభం చేకూర్చే పంటలనే సాగు చేయించే విధంగా ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగానే ఆయిల్పామ్ సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్నది. ఉద్యాన శాఖ యంత్రాంగం ఆ దిశగా రైతాంగానికి సూచనలు చేస్తూ ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తుంది. పైగా ప్రభుత్వం ఈసారి పూర్తిస్థాయి సబ్సిడీతో డ్రిప్ సైతం అందజేస్తున్నది.
ఆయిల్పామ్ సాగు చేసే రైతాంగానికి ప్రభుత్వం గతేడాది హెక్టారుకు రూ.37 వేల సబ్సిడీని అందజేయగా ఈ ఏడాది ఆ సబ్సిడీని రూ.55 వేలకు పెంచింది. మొదటి ఏడాది ఎకరాకు 143 మొక్కల కోసం రూ.29 వేల సబ్సిడీ అందజేస్తుంది. అనంతరం నాలుగేండ్ల పాటు ఎరువులకు గాను ఏడాదికి రూ.5,250 చొప్పున మొత్తం రూ.22 వేలు అందజేయనుంది. ఇక అంతర పంటల కోసం రూ.5,250 మొత్తంగా హెక్టారుకు రూ.55 వేలు అందజేస్తున్నది. ప్రతి జిల్లాకు ఓ కంపెనీని కేటాయించడమే కాక సదరు కంపెనీయే రైతులకు కావాల్సిన మొక్కలు అందజేసి పంట చేతికి వచ్చాక ఆ పంటను మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేసి రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో రైతులకు మార్కెటింగ్ ఇబ్బందులు తొలగిపోనున్నాయి.
ఆయిల్పామ్ పంటను ఎలా సాగు చేయాలి.. ఎకరాకు ఎంత ఖర్చు వ స్తుంది.. మార్కెటింగ్ పరిస్థితి ఏంటి అనే కోణంలో గతేడాది ఉద్యాన శాఖ రైతులకు అవగాహన కల్పించింది. ని యోజకవర్గాల వారీగా రైతులను బస్సు ల్లో ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట, కృ ష్ణా జిల్లాలోని హంపాపురం తీసుకెళ్లి అక్కడి పంటలను క్షేత్రస్థాయిలో సందర్శింపజేశారు. ఈ నేపద్యంలో గతేడు జిల్లాలో 1578 ఎకరాల్లో రైతులు ఆయిల్ పామ్ పంటలను సాగు చేయగా ఈ సారి ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని మరింత పెంచి 7750 ఎకరాలుగా చేసింది. గతం కన్నా ఈ సారి సబ్సిడీ సైతం పెంచటంతో ఆసక్తి కలిగిన రైతులు ఉద్యాన శాఖ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచిస్తున్నారు.
జిల్లాలో నీటి వనరులు పెరగటంతో రైతులంతా వరి సాగు చేయడం వల్ల పెద్దగా లాభాలు వచ్చే అవకాశం లేదు. సాంప్రదాయ సాగును వీడి ప్రత్యామ్నాయ పంటల దిశగా రైతాంగం దృష్టి సారించాలి. నూనె గింజల అవసరం పెరిగినందున ప్రస్తుతం ఆయిల్పామ్ను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. హెక్టారుకు రూ.55 వేల సబ్సిడీతో పాటు డ్రిప్ సౌకర్యం కల్పిస్తున్నందున రైతులు ఆయిల్పామ్ సాగు చేస్తే బాగుంటుంది. పంట ఉత్పత్తులు కంపెనీ ప్రతినిధులే తీసుకువెళ్తున్నందున మార్కెటింగ్ విషయంలో భయాలు అవసరం లేదు. ఈసారి 7,750 ఎకరాల్లో సాగు లక్ష్యం ఉన్నందున ఆసక్తి కలిగిన వారు వెంటనే ఉద్యానశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
– సంగీత లక్ష్మి, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి, నల్లగొండ
మార్కెటింగ్ సౌకర్యంతో పాటు ఆయిల్పామ్ సాగుతో మంచి లాభాలు ఉండటంతో రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం డ్రిప్ సౌక ర్యం కల్పిస్తున్నది. ప్రతి రైతుకు 12.50 ఎకరాల వరకు సాగు చేసుకునేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీతో డ్రిప్ అందజేస్తున్నది. ఇక సన్న, చిన్న కారు రైతులకు 90 శాతం, పెద్ద రైతులకు 80 శాతం సబ్సిడీతో డ్రిప్ అందజేయనుంది. ఆయిల్పామ్ ఎకరాకు 8 టన్నుల దిగుబడి వస్తుండగా టన్నుకు సగటున రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ధర పలుకుతుంది. ప్రస్తుతం టన్నుకు రూ.23 వేల ధర ఉంది. రూ.10 వేలు ధర పలికితేనే గిట్టుబాటు అయ్యే ఈ పంట అంతకు మించి పలికితే మంచి లాభాలు వచ్చినట్టే అని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు.