నార్కట్పల్లి, మే 16 : సాంకేతిక లోపంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న కండక్టర్ సహా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రం సమీపంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి జిల్లా భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం రాత్రి హైదరాబాద్ వైపు వెళ్తుండగా మార్గమధ్యలో నార్కట్పల్లి పట్టణ శివారులో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం తెలుసుకున్న నకిరేకల్, నార్కట్పల్లి, నల్లగొండ, మునుగోడు నుంచి 108 వాహనాలు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను దగ్గరలోని కామినేని దవాఖానకు తరలించాయి. బస్సు కండక్టర్ శ్రీనివాస్కు ఎడమ కాలు విరిగింది. నల్లగొండ మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన కొప్పు నవ్య, నార్కట్పల్లికి చెందిన శ్రీను తలకు బలమైన గాయాలు కాగా.. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
హైదరాబాద్కు చెందిన సురేశ్, రాహిత్యకు కాళ్లు, చేతులు విరిగాయి. కొత్తగూడేనికి చెందిన రవిబాబుకు కాలు విరిగింది. ఈ ఘటనతో జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి నేతృత్వంలో ట్రాఫిక్ను నియంత్రించారు. బస్సు డ్రైవర్ లక్ష్మణ్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికుడు మారయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.