నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు ఆర్టీసీ వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతున్నది. ప్రయాణికులకు రవాణా సౌకర్యం మెరుగు పర్చడంతోపాటు సరుకుల రవాణాకు కార్గో
సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా అనేక వస్తువులను తక్కువ చార్జీతో ఎగుమతి, దిగుమతి చేస్తూ ఆదాయం సమకూర్చుకుంటున్నది. ప్రత్యేక సందర్భాల్లో ఆర్టీసీ సేవలను ప్రజలకు మరింత దగ్గరికి చేరుస్తున్నది. శ్రీరామనవమికి భద్రాద్రి తలంబ్రాలు, మేడారం సమక్క సారలక్క బంగారం బుక్ చేసుకున్న వారికి ఇంటికే అందించింది. ఇక వివాహ శుభకార్యాలకు ప్రత్యేక బహుమతులు, రాయితీ ఇస్తున్నది. ప్రస్తుతం బంగినపల్లి మామిడి పండ్లను బుక్ చేసుకుంటే కార్గో సేవల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్నది.
– మిర్యాలగూడ టౌన్, మే 16
2020 జూన్లో ప్రారంభమైన కార్గో సేవలు 2021 మార్చి 31వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.4.30కోట్ల ఆదాయం సమకూరింది. రోజురోజుకూ భద్రతతో కూడిన కార్గో సేవలకు ఆదరణ పెరుగుతుండటం వల్ల ఈ ఏడాది సుమారు రూ.7కోట్ల ఆదాయం సాధించే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పార్సిల్స్, కొరియర్స్ ద్వారా రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లా ముందు వరుసలో ఉంది.
నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఆర్టీసీ చేస్తున్న ప్రయోగాల్లో మండల కేంద్రాల్లో కార్గో సెంటర్ల ఏర్పాటు ఒకటి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 74 సెంటర్లను అందుబాటులోకి తెచ్చారు. ఆర్టీసీ బస్సులు వెళ్లేప్రతి గ్రామానికీ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కార్గో సెంటర్ల ద్వారా సేవలు అందుతున్నాయి.
ఆర్టీసీ ప్రారంభించిన కార్గో సర్వీసులకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. రైతులు కార్గో సేవలను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. ఇంకా మెరుగైన సేవలతో ప్రజలకు చేరువయ్యేందుకు సిబ్బంది సహకారంతో కృషి చేస్తాం.
-బొల్లెద్దు పాల్, మిర్యాలగూడ డిపో మేనేజర్