జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జోరందుకున్నాయి. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 256 కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేపడుతున్నది. గత సీజన్లో కరోనా పరిస్థితుల్లోనూ రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించగా, ఈసారీ అదే స్థాయిలో అధికారులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. 83 ఐకేపీ, 168 పీఏసీఎస్, 5 మార్కెట్ కమిటీల కేంద్రాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతుండగా.. ఎక్కడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షిస్తున్నారు.
కలెక్టర్ పమేలా సత్పతి నిత్యం సమీక్ష నిర్వహిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాలో ఈ యాసంగి లక్ష్యం 3లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఇప్పటివరకు 63,673 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ట్యాబ్ ఎంట్రీ పూర్తయిన రైతుల ఖాతాల్లో రూ.13.63 కోట్లు జమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతున్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ వడ్లు కొని ఆదుకుంటున్నారని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి, మే 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు దిగాలు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సీజన్లోనూ రైతులకు భరోసా కల్పిస్తూ వస్తున్నది. గతంలో రైతున్న కష్టాన్నంతా దళారులే సొమ్ము చేసుకోగా ఆ ఇబ్బందులను తొలగించేందుకు సీఎం కేసీఆర్ రెండేళ్లుగా గ్రామాల్లోనే ధాన్యం కొనుగోళ్లు జరిపి రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేసేలా చర్యలు తీసుకు న్నారు. ఈ సీజన్లో కేంద్రం వడ్లను కొనేందుకు మొండికేసినప్పటికీ కొనుగోళ్లు జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లాలో 256 ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించి కొనుగోళ్లు జరుపుతున్నారు. రైతులు ధాన్యం అమ్ముకోవడంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాల వద్ద అధికార యంత్రాంగం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.
జిల్లాలో 83 ఐకేపీ,168 పీఏసీఎస్,5 మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతుండగా ఆయా శాఖల అధికారులు నిరంతరం కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ పమేలా సత్పతి ప్రతి రోజూ సమీక్షలు నిర్వహించి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. కేంద్రాల్లో ధాన్యం తూకం మొదలు మిల్లుల్లో దిగుమతి చేసే వరకు పర్యవేక్షణ ఉంటుండడంతో రైతులకు ఇబ్బందులు సైతం కలగడం లేదు. నాణ్యమైన ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చివరి గింజ వరకూ ప్రభుత్వం కొంటుందని అధికారులు రైతులకు ధైర్యం కల్పిస్తున్నారు. అనుమతులు ఇచ్చిన రైస్ మిల్లుల్లో ధాన్యం దిగుమతుల సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక బృందాలతో పర్యవేక్షిస్తున్నారు. రైతుల నుంచి ఫిర్యాదుల వచ్చిన వెంటనే పరిష్కరించేందుకు చొరవ చూపుతుండడంతో జిల్లాలో వారం రోజులుగా ధాన్యం కొనుగోళ్లు జోరందుకున్నాయి.
యాసంగి ధాన్యానికి సంబంధించి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రత్యేక ప్రణాళికతో అధికారులు ముందుకు వెళ్తుండడంతో సజావుగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన 256 కొనుగోలు కేంద్రాల్లో 7,870 మంది రైతుల నుంచి 63,673 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించి ట్యాబ్ ఎంట్రీ పూర్తయిన వాటికి సంబంధించి రూ. 13.63 కోట్లను అధికారులు రైతుల ఖాతాల్లో జమ చేశారు. డబ్బుల చెల్లింపుల్లో ఎటువంటి జాప్యం లేకుండా చర్యలు చేపడుతున్నారు.
కేంద్రాలకు తరలివస్తున్న ధాన్యానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసి కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూస్తు న్నాం. ఎక్కడ చిన్న సమస్య తలెత్తినా వెంటనే అధికారులను అప్రమత్తం చేసి పరిష్కరిస్తున్నాం. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నందున రైతులు ఆందోళన చెందొద్దు.
– ఎం. గోపికృష్ణ, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్