భువనగిరి కలెక్టరేట్, మే 16 : పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా, రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేనతో కలిసి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఈఓలతో జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పరీక్షల ఏర్పాట్లపై కలెక్టర్ వివరించారు.
పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 9,477 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఇందు కోసం 60 కేంద్రాలను ఏర్పాటు చేశామని, నాలుగు ఫ్లయింగ్, మూడు సిట్టింగ్ స్కాడ్స్, 60మంది డిపార్టుమెంట్ ఆఫీసర్లు, 1,266 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద మౌలిక సౌకర్యాలు, నిరంతర విద్యుత్, బస్సు సౌకర్యం, రిజర్వ్ సిబ్బంది తదితర ఏర్పాట్లు చేపట్టామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, డీఈఓ కె.నర్సింహ, వైద్యాధికారి మల్లికార్జునరావు, పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ రంగరాజన్, ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్, ట్రాన్స్కో ఏడీఈ సత్యప్రకాశ్ పాల్గొన్నారు.