బుద్ధపూర్ణిమను పురస్కరించుకుని నాగార్జునసాగర్ హిల్కాలనీలోని బుద్ధవనం దేదీప్యమానంగా కాంతులీనింది. గౌతమ బుద్ధుడి 2566వ జయంతి సందర్భంగా సోమవారం ఉదయం బౌద్ధ గురువులు, ప్రముఖులు బుద్ధుడి పాదముద్రల వద్ద పుష్పాంజలి ఘటించారు. మహాస్తూపంలో బౌద్ధ సంప్రదాయం ప్రకారం ప్రార్థనలు చేశారు. రాత్రి పున్నమి వెలుగులతో పోటీపడుతూ విద్యుద్దీపాలంకరణలో బుద్ధవనం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నది.
నందికొండ, మే 16 : నందికొండలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన బుద్ధవనంలో సోమవారం గౌతమ బుద్ధుడి 2566వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో బౌద్ధగురువులు, భిక్షువులు సంప్రదాయబద్ధంగా బుద్ధుడి పాదాలకు పుష్పాంజలి ఘటించారు. మహాస్థూపం అంతర్ భాగంలోని సమావేశ మందిరంలో మైసూర్ నుంచి విచ్చేసిన బౌద్ధ భిక్షువులతో మహాబోధి సొసైటీ, ఆనంద బుద్ధ విహార బౌద్ధ భిక్షువులతో ప్రార్థనలు చేశారు.
సంగపాల బంతే, బౌద్ధ గురువు గేసే నగ్వాంగ్, హర్యానా అడిషనల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ మాట్లాడారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ బుద్ధుడి బోధనలు, అంబేద్కర్ మార్గాలు ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు. 2015లో అసంపూర్తిగా ఉన్న బుద్ధవనాన్ని చూసి సీఎం కేసీఆర్ దండిగా నిధులు విడుదల చేసి అత్యంత సుందరంగా బుద్ధవనాన్ని తీర్చిదిద్దినట్లు తెలిపారు. అంతకుముందు ఆకాశంలోకి బెలూన్లను వదిలారు.
2,566 సంఖ్య రూపంలో రంగురంగుల విద్యుద్దీపాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే నోముల భగత్కుమార్, ప్రముఖ పాత్రికేయుడు రామచంద్రమూర్తి, బుద్ధవనం ఓఎస్డీ సుధాన్రెడ్డి, పురావస్తు నిపుణుడు శివనాగిరెడ్డి, బుద్ధవనం సహాయక శిల్పి శ్యాంసుందర్, బౌద్ధారామ ప్రధాన భిక్షువు షెరె, సంతోష్రావత్, క్రాంతిబాబు, సంతోష్రావత్, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యులు పాల్గొన్నారు.