తరుముకొచ్చే అవసరం నుంచే సృజనాత్మకత పుట్టుకొస్తుంది. దాని ద్వారానే అప్పటి వరకు అసాధ్యమైన పని సులభమవుతుంది. సరికొత్త ఆలోచనై మెరుస్తుంది. విశిష్ట ఆవిష్కరణై వెలుగుతుంది. మన జిల్లాలో గ్రామీణ ప్రాంతం నుంచి కొత్త ఆవిష్కరణలతో వెలుగులోకి వస్తున్నారు. ఏదైనా చేయాలనే పట్టుదల, కృషి, మనో ధైర్యంతో ముందుకెళ్తున్నారు. ఇప్పటి దాకా కనుగొనని వినూత్న ఆవిష్కరణలను రూపొందిస్తున్నారు. జిల్లా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతున్నారు. సామాజిక అంశాలే ఇతివృత్తంగా ఆలోచనలు ప్రదర్శించేందుకు ప్రభుత్వం వేదిక కల్పిస్తున్నది. వినూత్నమైన ఆవిష్కరణలను వెలికి తీసి ప్రోత్సహించేందుకు ఇంటిటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మండలాలు, గ్రామాల నుంచి అన్ని వర్గాలను ఆహ్వానిస్తున్నది. విద్యార్థులు, యువత, రైతులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, మహిళలు అందరినీ ఇందులో భాగస్వామ్యం చేస్తున్నది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా ఇన్నోవేషన్లో యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి అనేక మంది గ్రామీణ శాస్త్రవేత్తలు భాగస్వాములై ప్రతిభ చూపారు. ఇందులో 14మంది ఎంపికై అవార్డులు కూడా అందుకున్నారు.
గ్రామీణ ప్రాంత ఆవిష్కర్తలను ప్రోత్సహించేందుకు సర్కారు ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమం చేపట్టింది.
ఇందులో భాగంగా జిల్లాల వారీగా ఉత్తమ ఆవిష్కరణలను టీఎస్ఐసీ (తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్)
గుర్తిస్తుంది. ఈ ఆవిష్కరణకు వాణిజ్య రూపాన్ని ఇచ్చేందుకు అవసరమైన సహకారాన్ని టీఎస్ఐసీ
అందిస్తున్నది. ప్రోత్సాహకాల కోసం రూ.30లక్షల కార్పస్ ఫండ్ కూడా కేటాయించింది.
అంతేకాకుండా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో టీహబ్ ద్వారా స్టార్టప్లకు ప్రోత్సాహం, వీహబ్ ద్వారా మహిళలకు శిక్షణ ఇస్తున్నది. ఇలా ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని రాష్ట్ర సర్కారు భావిస్తున్నది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా ఇన్నోవేషన్లో మన జిల్లా నుంచి అనేక మంది గ్రామీణ శాస్త్రవేత్తలు భాగస్వాములై తమ ప్రతిభకు, ప్రావీణ్యానికి పదును పెట్టారు. ఇందులో 14మంది ఎంపికై అవార్డులు కూడా అందుకున్నారు.
ఎద్దులు, ట్రాక్టర్ల సహాయంతో అంతర పంటల సాగు సులభతరం కాదు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్ నానో ట్రాక్టర్ను తయారు చేసింది బొమ్మలరామారం ఆదర్శ పాఠశాల విద్యార్థిని బొల్లపల్లి శివాని. ఇది ఇంధనాలతో కాకుండా బ్యాటరీ సహాయంతో నడుస్తుంది. ఇది ట్రాక్టర్ చేసే అన్ని పనులను (దున్నడం, కలుపు తీయడం, మందులు పిచికారీ చేయడం) చేయడమే కాకుండా అంతర పంటల సాగులో కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని దివ్యాంగులు కూడా ఉపయోగించే విధంగా అభివృద్ధి చేశారు.
చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్పేట జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి చెంచుల వంశీ సరికొత్త ప్రయోగాన్ని ఆవిష్కరించాడు. మొబైల్ ఫోన్ ఉపయోగించి స్కూల్ మైక్రోస్కోప్ను రూపొందించాడు. సీసం గోలిని పగులగొడితే వచ్చే కుంభాకార కటకాన్ని ఒక చిన్న టేబుల్కు అమర్చాడు. కింది భాగంలో ైస్లెడ్స్, బ్యాక్టీరియా, హైడ్రా, అమీనాను ఉంచి, పైభాగంలో ఒక సెల్ఫోన్ పెట్టి వాటిని పరిశీలించవచ్చు. తద్వారా వాటి సైజ్ కంటే 25రెట్లు ఎక్కువగా కనిపిస్తుంది. ప్రయోగాత్మక విద్యాబోధనకు ఇది ఉపయోగపడుతున్నది. కేవలం రూ.200 ఖర్చుతో ఇది తయారైంది.
నిత్యం ఇంట్లో వినియోగించే మినుములు, పెసర్లు, కొర్రలు, ఊదలు, అరికలు, సామలు, అండుకొర్రలు వంటి తృణధాన్యాల నూర్పిడికి యంత్రాలు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తృణధాన్యాల నూర్పిడి యంత్రాన్ని తయారు చేసింది బొమ్మలరామారం పాఠశాల విద్యార్థిని అన్నెబోయిన భవాని. ఈ యంత్రం ఎక్కడికంటే అక్కడికి సులభంగా తీసుకెళ్లవచ్చు. పర్యావరణానికి అనుకూలమైన యంత్రాన్ని ఉపయోగించి రైతులు సమయం ఆదా చేసుకోవడంతోపాటు, అధిక లాభాలు పొందే అవకాశం ఉంది.
తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన ఎలుగల వెంకటేశం డిగ్రీ వరకు చదువుకున్నాడు. తన భూమితోపాటు రెండెకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశాడు. పత్తి చేనులో కలుపు తీయడానికి ఎద్దులు లేక, కిరాయికి తీసుకొచ్చే స్తోమత లేక ఇబ్బంది పడ్డాడు. దీంతో తన వద్ద ఉన్న పాత సైకిల్కు ముందు చక్రాన్ని అలాగే ఉంచి.. వెనుక భాగంలో గుంటుక బ్లేడును వెల్డింగ్ చేసి అమర్చాడు. అలా తయారు చేసిన సైకిల్ గుంటుక సహాయంతో తన పత్తి చేనులో ఉన్న కలుపు మొక్కలు తీసి డబ్బును ఆదా చేసుకున్నాడు.
పైసా ఖర్చు లేకుండా బయోమస్కిటో రెఫిలెట్ను తయారు చేసింది తుర్కపల్లి మండలంలోని ముల్కలపల్లి జడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదువుతున్న బానోతు మౌనిక. దోమల నివారణకు మార్కెట్లో దొరికే హానికారక మస్కిటో కాయల్స్, లిక్విడ్లను ఉపయోగిస్తూ ప్రజలు ఆరోగ్యపరంగా ఇబ్బందులకు గురవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బొజ్జ తండాకు చెందిన గిరిజన విద్యార్థిని మౌనిక, ఉపాధ్యాయురాలు కళ్యాణి సహకారంతో బయోమస్కిటో రెఫిలెట్ను తయారు చేసింది. చింత గింజలను కుండలో పోసి, అందులో నీళ్లు నింపి, నెల రోజులపాటు భూమిలో పాతిపెట్టారు. ఆ తర్వాత కుళ్లిపోయి తయారైన పేస్టులో వావిలి, తులసి, వేప, సజ్జ ఆకులను ఎండబెట్టి చేసిన పొడిని కలిపారు. వాటిని వివిధ ఆకృతుల్లో ఎండబెట్టి వాటితో బయోమస్కిటో రెఫిలెట్ను తయారు చేశారు.
బీబీనగర్ మండలం జమిలాపేట్ జడ్పీహెచ్ఎస్కు చెందిన పదో తరగతి విద్యార్థిని ఏనుగుల చాందిని సురక్షితంగా పండ్లు తెంపే పరికరాన్ని ఆవిష్కరించి ఇన్నోవేషన్కు ఎంపికైంది. పాత షటిల్ బ్యాట్ తీసుకొని.. దానికి పైన ఉన్న నెట్ను పూర్తిగా తొలగించింది. బ్యాట్ పైభాగంలో పూర్తిగా సంచిని అమర్చింది. దానికి రెండు బ్లేడ్లను ఏర్పాటు చేసింది. బ్యాట్ కర్రకు జాయింట్గా 10మీటర్లు పైకి, కిందకు వెళ్లే విధంగా ఒక పైపును అమర్చింది. తద్వారా అన్ని రకాల చెట్ల నుంచి ఎంత ఎత్తైనా పండ్లను సురక్షితంగా సేకరించవచ్చు. ఈ ఆవిష్కరణ పండ్ల తోటలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు తక్కువ సమయంలో ఎక్కవ గుంతలు సులభంగా తీయడానికి ఎలక్ట్రికల్ ఎర్త్ ఆగర్ను తయారు చేసింది బొమ్మలరామారం ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థిని ఊట్ల మేఘన. దీనిని మార్కెట్లో లభించే ఇంధనాలతో నడిచే యంత్రాల కంటే తక్కువ ధరలో తయారు చేశారు. ఇది పూర్తిగా పర్యావరణ అనుకూలమైనది. దీనిని సౌరశక్తిని ఉపయోగించి కూడా వినియోగించుకోవచ్చు.
అడ్డగూడూరు మండలంలోని చిర్రగూడూరు గ్రామానికి చెందిన పి.రాజ్కుమార్ గ్రిజోల్ కలుపు మందు పరికరాన్ని తయారు చేశాడు. ఈ పరికరంతో పత్తి పంటలో కలుపు మందు కొడి తే పత్తి చెట్లు చనిపోవు. కలుపు మొక్క లు మాత్రమే చనిపోతాయి. కూలీల కొర త కూడా ఉండటంతో కలు పు మొక్కల నివారణకు ఈ పరికరం రైతులకు బాగా ఉపయోగపడుతుందని రాజ్కుమార్ చెప్పుకొచ్చారు.
కుట్టు మిషన్తో దుస్తులు కుడుతున్న సమయంలో దారం చిక్కు పడకుండా ఉండేందుకు ప్లాస్టిక్ బాటిల్ సహాయంతో పరికరాన్ని తయారు చేసింది బీబీనగర్ మండలం జమిలాపేట్ జడ్పీహెచ్ఎస్లో ఏడో తరగతి చదువుతున్న ప్రవళిక. దీనికోసం ఒక బాటిల్ను తీసుకుని రెండు భాగాలుగా కట్ చేయాలి. ఆ రెండింటికీ రెండు వైపులా రంధ్రాలు చేసి అందులో దారం కండెలు ఉంచాలి. వాటి చివర రబ్బర్ బ్యాండ్ను ఏర్పాటు చేయాలి. ఇలా అమర్చిన కండెల నుంచి దారాన్ని కింది వరకు తీసుకురాగా.. మనకు కావాల్సిన దారాన్ని ఎంచుకోవచ్చు. తమ ఇంట్లో అమ్మ కుట్టుమిషన్ కుట్టే సమయంలో దారాలు చిక్కు పడ్డప్పుడు సులభంగా రాక దారంతోపాటు సమయం కూడా వృథా అయ్యేదని, అందుకే దీన్ని తయారు చేశానని ప్రవళిక చెప్పుకొచ్చింది.