‘తిరుగుబాటుకు తెలంగాణ ప్రతీకగా నిలుస్తుంది. అణచివేతకు గురి చేసినప్పుడు విముక్తి కోసం ధిక్కారం వినిపించడంలో ఈ నేలకున్న మహత్యం అనన్యసామాన్యమైనది.. అందుకు సర్వాయి పాపన్న వీరోచిత పోరాటం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా నల్లగొండ కలెక్టరేట్లో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించి మాట్లాడారు. మొఘలులు మొదలు రజాకార్ల వరకు జరిగిన వ్యతిరేక పోరాటంలో తెలంగాణ ప్రజల పోరాటమే సింహభాగమన్నారు. అదే స్ఫూర్తితో పరాయి పాలన నుంచి విముక్తి కోసం పోరాడి ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నట్లు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, కొమురంభీం లాంటి వారి చరిత్రను కనుమరుగు చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ వెలుగులోకి తెచ్చి అధికారికంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. త్వరలో సర్దార్ పాపన్న, ధర్మభిక్షం విగ్రహాలను నల్లగొండలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
నల్లగొండ, ఆగస్టు 18 : తిరగుబాటుకు ప్రతీక తెలంగాణ రాష్ట్రం అని, అందుకు సర్దార్ సర్వాయి పాపన్న వీరోచిత పోరాటం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. పాపన్న జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో గురువారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత పాపన్న చిత్రపటానికి స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అక్షరం జ్ఞానం లేని రోజుల్లోనే అణచివేతకు గురైన సందర్భంలో దానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడిని స్మరించుకోవడం గొప్ప విషయమన్నారు. అలాంటి యోధుడి విగ్రహాన్ని త్వరలోనే నల్లగొండలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మొఘలుల మొదలు రాజాకార్ల వరకు జరిగిన వ్యతిరేక పోరాటంలో తెలంగాణ ప్రజల పోరాటమే సింహ భాగమన్నారు. అదే స్ఫూర్తితో పరాయి పాలన నుంచి విముక్తి కోసం పోరాడి ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నట్లు తెలిపారు. అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమించిన పాపన్నలో రాజ్యాధికారం సాధించాలన్న పట్టుదల పెరిగిందని పేర్కొన్నారు.
సర్వాయి పాపన్న మొదలు దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, కొమురం భీం లాంటి వారి చరిత్రను సమైక్య పాలనలో కనుమరుగు చేస్తే, సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక వారి చరిత్రను వెలుగులోకి తెచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా వారి జయంతులు, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ.. సర్వాయి పాపన్నను 372 ఏండ్ల తర్వాత కూడా గుర్తు చేసుకోవటానికి కారణం ఆయన చేసిన వీరోచిత పోరాటమే అన్నారు.
ఇలాంటి మహానుభావులను గత పాలకులు పట్టించుకోకపోవటంతో వారి చరిత్ర కనుమరుగై పోతున్న క్రమంలో సీఎం కేసీఆర్ తిరిగి వెలుగులోకి తేవటానికే అధికారికంగా జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గౌడ్ల కోరిక మేరకు మంత్రి సహకారంతో నల్లగొండలో పాపన్న, ధర్మభిక్షం విగ్రహాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.
కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్గౌడ్, మాదగోని శ్రీనివాస్గౌడ్, గౌడ సంఘ జిల్లా అధ్యక్షుడు నకిరేకంటి కాశయ్యగౌడ్, పీఆర్టీయూ అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్, కనగల్ జడ్పీటీసీ చిట్ల వెంకటేశంగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, బీసీ సంఘం అధ్యక్షుడు చక్రహరి రామరాజు, ఎంబీసీ కులాల అధ్యక్షుడు కొండూరు సత్యనారాయణ, శంకర్ గౌడ్, రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్, దుడుకు లక్ష్మీనారాయణ, వైద్యం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్ : స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రను మూడోతరానికి తెలియజేయాలనే సంకల్పతోనే సీఎం కేసీఆర్ వజ్రోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టారని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో జిల్లా స్థాయి ఫ్రీడం కప్ పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.
అహింసాయుత మార్గంలో మహాత్మాగాంధీ స్వాతంత్య్ర సాధించారని, అదే స్ఫూర్తితో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని పేర్కొన్నారు.
అంతకుముందు ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డితోపాటు ఇతర అధికారులు క్రికెట్ పోటీలో పాల్గొన్నారు. అనంతరం వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణాచారి, జిల్లా యువజన, క్రీడల అధికారి మగ్బూల్ అహ్మద్, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.