నీలగిరి, ఆగస్టు 18 : తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం సర్పంచ్ గాదె సంధ్య భర్త గాదె విజయ్రెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. ఎల్లమ్మగూడేనికి చెందిన ఊట్కూరి సందీప్రెడ్డి, ఊట్కూరు ప్రదీప్రెడ్డి పథకం ప్రకారం హత్య చేసినట్లు వెల్లడించారు.
తమపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తుండడంతో పాటు ప్రతి విషయంలో అడ్డు వస్తున్న విజయ్రెడ్డిని అడ్డు తొలగించుకునేందుకు అతడిని హత్య చేయాలని సందీప్రెడ్డి, ప్రదీప్రెడ్డి పథకం పన్నారు. తిప్పర్తిలో ఉంటున్న సందీప్రెడ్డి తన హార్వెస్టర్ వాహనానికి వాడే కారును తీసుకొని నెలక్రితం సూర్యాపేటకు వెళ్లాడు. అక్కడ రెండు గొడ్డళ్లను కొనుగోలు చేశాడు. వాటి సాయంతో గ్రామ శివారులో విజయ్రెడ్డిని హత్య చేయాలని రెండు సార్లు ప్రయత్నించారు.
కానీ జనాలు తిరుగుతుండడం, అతను వచ్చే కదలికలు తెలియకపోవడంతో మానుకున్నారు. అతడి కదలికలు తెలుసుకునేందుకు విజయ్రెడ్డితో పొలం తగాదా ఉన్న మన్నెం ఉపేందర్రెడ్డిని సాయం కోరారు. దానికి అతను ఒప్పుకోగా పొలం వద్దే ఉండి విజయ్రెడ్డి రాకపోకలను చెప్పాలని కోరారు. ఈ నెల 13న విజయ్రెడ్డికి చెందిన ట్రాక్టర్ మందు బస్తాలతో పొలం వద్దకు వచ్చింది. విజయ్రెడ్డి కూడా కచ్చితంగా వస్తాడని ఉపేందర్రెడ్డి ద్వారా తెలుసుకున్న నిందితులు అతడి హత్యకు పథకం రచించారు.
విజయ్రెడ్డిని ఏఎంఆర్పీ సబ్ కెనాల్ పక్కనే హత్య చేయాలనే పథకం ప్రకారం నిందితులిద్దరూ అక్కడే వేచి ఉన్నారు. విజయ్రెడ్డి బైక్పై బావి వద్దకు వస్తుండగా ట్రాన్స్పోర్ట్ కారుతో అక్కడే సిద్ధంగా ఉన్న సందీప్రెడ్డి, ప్రదీప్రెడ్డి అతడికి ఎదురుగా వెళ్లి ఢీకొట్టారు. విజయ్రెడ్డి కింద పడిపోగా బైక్ అతడిపై పడడంతో పైకి లేవలేక పోయాడు. నిందితులిద్దరూ తమ వెంట తెచ్చుకున్న గొడ్డళ్లతో అతడిపై దాడి చేసి విచక్షణా రహితంగా నరికారు. దాంతో విజయ్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా నిందితులు తమ వాహనంలో పారిపోయారు.
విజయ్రెడ్డి సర్పంచ్ భర్త కావడంతోపాటు అడ్వకేట్గా కూడా పనిచేస్తుండడం, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధిపై కూడా ఆరోపణలు రావడంతో జిల్లా పోలీస్ యంత్రాంగం కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని విచారణ చేపట్టింది. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ కోణాల్లో విచారణ చేయగా.. కేవలం వ్యక్తిగత పగలతోనే హత్య జరిగినట్లు విచారణలో తెలిందని ఎస్పీ వివరించారు.
నిందితులపై ప్రత్యేక నిఘా పెట్టడంతో వారు ఎల్లమ్మగూడెం పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు సమాచారం అందుకొని గురువారం తెల్లవారుజామున ఆరెస్టు చేసినట్లు వివరించారు. సమావేశంలో నల్లగొండ డీఎస్పీ నర్సింహారెడ్డి, సీఐ రాఘవరావు పాల్గొన్నారు.
ఎల్లమ్మగూడెం గ్రామంలో 16 సంవత్సరాల క్రితం(2006) బాలిక అత్మహత్య చేసుకుంది. ఈ విషయంలో పెద్దమనుషులుగా వ్యవహరించిన సందీప్రెడ్డి, ప్రదీప్రెడ్డి తండ్రులపై విజయ్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసి వారిపై కేసు పెట్టాడు. దాంతో వారు నెలరోజులపాటు జైలుశిక్ష అనుభవించారు.
అప్పటి నుంచే సందీప్రెడ్డి, ప్రదీప్రెడ్డి విజయ్రెడ్డిపై పగపెంచుకున్నారు. మార్చిలో మరుగుదొడ్ల బిల్లుల విషయంలో అక్రమాలు జరిగాయని గ్రామస్తులు సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ సభ్యులను గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు.
అయితే ఈ విషయమై గ్రామస్తులపై కాకుండా వీరిద్దరిపైనే విజయ్రెడ్డి తన భార్యతో కేసు పెట్టించాడు. దాంతో పాటు పలు విషయాల్లో విజయ్రెడ్డి తమపై కేసులు పెట్టిస్తున్నాడని, గ్రామ సర్పంచ్ భర్తగా, అడ్వకేట్గా ఉన్న అతను తమను తరచూ వేధింపులకు గురి చేస్తున్నాడని భావించిన నిందితులు అతడిని హత్య చేసేందుకు పథకం రచించి అమలు చేశారు.