స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా వేడుకల్లో పాల్గొంటున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జానపద కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తిరంగా ర్యాలీలు నిర్వహించారు.
ఇండ్లపై మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. మిర్యాలగూడ పట్టణంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి జాతీయజెండాను ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాల అందజేత, శకటాల ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జిల్లావ్యాప్తంగా ఆదివారం కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా పలు ప్రాంతాల్లో బైక్, తిరంగా ర్యాలీలు నిర్వహించారు. ఇండ్లపై మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. జిల్లా కేంద్రంలోని క్లాట్టవర్ వద్ద ఏర్పాటు చేసిన ఎత్తైన జాతీయ పతాకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు పొడవైన జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. మిర్యాలగూడలో మైనార్టీల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లాకేంద్రంలోని జంక్షన్లను మూడు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.
నల్లగొండ, ఆగస్టు 14 : భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తి కావడంతో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 14 రోజుల పాటు పండుగ వాతావరణంలో వజ్రోత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవాన్ని మరింత వేడుకగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
కరోన కారణంగా గడిచిన రెండేండ్లుగా ఉత్సవాలను కలెక్టరేట్లో నిరాడబరంగా నిర్వహించిన జిల్లా యంత్రాంగం ఈ సారి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఉదయం 10.30 గంటలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం ఆయా శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రశంశా పత్రాల అందిస్తారు.
అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల పథకాలపై శకటాల ప్రదర్శన చేపడతారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పరేడ్ గ్రౌండ్లో ఆయా శాఖల అధికారులు చేసిన ఏర్పాట్లను ఆదివారం ఎస్పీ రెమా రాజేశ్వరి పరిశీలించారు.