తన స్వార్థ రాజకీయం కోసం రాజీనామా చేసి మునుగోడు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన రాజగోపాల్రెడ్డిని ప్రజలు క్షమించరని, వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కనీయకుండా తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఈ నెల 20న మునుగోడులో చేపట్టనున్న ప్రజాదీవెన సభను విజయవంతం చేయాలని సంస్థాన్ నారాయణపురం, మర్రిగూడ మండల కేంద్రాల్లో నిర్వహించిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు.
కేసీఆర్ సైన్యాన్ని చూస్త్తే బీజేపీ అధిష్టానం ఉలిక్కి పడుతున్నదని, అందుకే ఈడీలతో బెదిరింపులకు పాల్పడుతున్నదని అన్నారు. ఎనిమిదేండ్ల మోదీ పాలనలో విధ్వంసాలు తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. ఈ నెల 20న లక్ష మందితో నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రజాదీవెన సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో గుడిమల్కాపురం, పులిపలుపుల కాంగ్రెస్ ఎంపీటీసీలు టీఆర్ఎస్లో చేరారు. అలాగే హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమక్షంలో ఐదుగురు సర్పంచులు, ఇద్దరు ఎంపీటీసీలు గులాబీ పార్టీలో చేరారు.
మర్రిగూడ/మునుగోడు/సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 14 : మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎందుకొచ్చిందో నియోజకవర్గ ప్రజలు ఆలోచించాల్సిన అవసరముందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మునుగోడులో ఈ నెల 20న సీఎం కేసీఆర్ ప్రజాదీవెన బహిరంగ సభ నేపథ్యంలో సంస్థాన్నారాయణపురం, మర్రిగూడ మండలాల్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్రలో భాగంగా బీజేపీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డితో రాజీనామా చేయించిందని విమర్శించారు.
రూ.22వేల కోట్ల కాంట్రాక్టుకు కక్కుర్తి పడి రాజగోపాల్రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైందన్నారు. పెంచి పోషించిన కాంగ్రెస్ పార్టీని, నమ్మి ఓట్లేసిన నియోజకర్గ ప్రజలను నడిబజారులో అమ్మిన నీచుడు రాజగోపాల్రెడ్డి అని మండిపడ్డారు. నల్లగొండ జిల్లా ప్రజల హక్కులను ఆంధ్రా పాలకులకు తాకట్టు పెట్టి కోట్లు కూడబెట్టుకున్న దొంగలు కోమటిరెడ్డి సోదరులని విమర్శించారు. ప్రజా వ్యతిరేక బీజేపీకి అమ్ముడుపోయిన రాజగోపాల్రెడ్డికి చెప్పు దెబ్బలతో తగిన బుద్ధి చెప్పేందుకు నియోజకవర్గం సిద్ధంగా ఉందన్నారు. ఫ్లోరైడ్ మహమ్మారితో అల్లాడుతున్న మునుగోడు ప్రజలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ రూ.50వేల కోట్లతో మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేశారని గుర్తు చేశారు.
సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయన్నారు. బీజేపీ, రాజగోపాల్రెడ్డి స్వార్థంతో కూడిన కుట్రలను టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు. మునుగోడులో ఈ నెల 20న తలపెట్టిన సీఎం కేసీఆర్ ప్రజాదీవెన సభ విజయవంతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సంస్థాన్ నారాయణపురం మండలంలోని 31 గ్రామ పంచాయతీలకు గాను ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డికి 16 గ్రామపంచాయతీలు, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కు 15గ్రామపంచాయతీలు ఇన్చార్జిగా నియమించారు. వారు ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు సమీక్ష సమావేశం నిర్వహించి గ్రామానికొకరు చొప్పున ఇన్చార్జిగా నియమించారు.
సమావేశాల్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, మునుగోడు ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గాదరి కిశోర్కుమార్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మునగాల నారాయణరావు, మర్రిగూడ ఎంపీపీ మెండు మోహన్రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్రెడ్డి, మార్కెట్ చైర్మన్ దంటు జగదీశ్వర్, మండలాధ్యక్షుడు తోటకూర శంకర్, సహకార సంఘం చైర్మన్లు, సంస్థాన్నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమాదేవి, జడ్పీటీసీ వీరమళ్ల భానుమతీగౌడ్, పీఏసీఏస్ చైర్మన్ జక్కడి జంగారెడ్డి, రాష్ట్ర నాయకుడు నారబోయిన రావి, బోళ్ల శివశంకర్, మండలాధ్యక్షుడు కత్తుల లక్షయ్య పాల్గొన్నారు.
మునుగోడు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. నియోజకవర్గ పరిధిలోని సంస్థాన్నారాయణపురం మండలంలోని గుడిమాల్కాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ శివరాత్రి కవితావిద్యాసాగర్, మునుగోడు మండలం పులిపలుపుల గ్రామ ఎంపీటీసీ బోలుగురి లింగయ్య కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు.
సీఎం కేసీఆర్ సభా ఏర్పాట్ల నిమిత్తం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీటీసీలు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నదన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.