నందికొండ, ఆగస్టు 14 : ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వరద పోటెత్తడంతో నాగార్జునసాగర్ రిజర్వాయర్ 26 క్రస్ట్ గేట్ల ద్వారా నాలుగు రోజులుగా నీటి విడుదల కొనసాగుతుంది. ఈ నెల 11 నుంచి 14 వరకు నాలుగు రోజుల్లోనే స్పిల్వే ద్వారా 120 టీఎంసీ నీటిని దిగువకు విడుదల చేశారు. కృష్ణమ్మ జోరు తగ్గక పోవడంతో ఆల్మట్టి, నారాయణపుర్, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్లకు వరద పోటెత్తుతుంది. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్ట్లకు భారీగా ఇన్ఫ్లో నమోదవుతుండటంతో వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు.
కృష్ణమ్మ పరువళ్లతో ప్రాజెక్ట్లన్ని జలశోభితను సంతరించుకున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 3,76,383 క్యూసెక్కుల ఇన్ఫ్లో నాగార్జునసాగర్ రిజర్వాయర్కు కొనసాగుతుంది. సాగర్ 26 క్రస్ట్ గేట్ల (16 గేట్లు 5 అడుగులు, 10 గేట్లు 10 అడుగుల మేర ) ద్వారా 2,60,316 క్యూసెక్కులు, కుడి కాల్వ ద్వారా 8,604 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 8,629 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 29,110 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 2,400 క్యూసెక్కులు, ఎల్ఎల్సీ ద్వారా 300 క్యూసెక్కులతో కలిపి మొత్తం 3,09,359 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590(312 టీఎంసీలు) అడుగకులకు గాను 584.90(297.1465 టీఎంసీలు) అడుగుల మేరకు నీరు నిల్వ ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను 884.40(212.4385 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది. వరద ఉధృతి కొనసాతుండడంతో మరికొన్ని రోజులు క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగే అవకాశం ఉంది.
అడవిదేవులపల్లి : మండల కేంద్రానికి చేరువలో ఉన్న టెయిల్పాండ్ ప్రాజెక్టుకి ఆదివారం నాగార్జున సాగర్ నుంచి సుమారు 2,89,426 క్యూసెక్కుల నీరు వస్తున్నదని ఇన్చార్జ్ ఏడి కె. నరసింహరావు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 15 క్రస్ట్ గేట్లు నాలుగు మీటర్ల మేర ఎత్తి 2,64,720 క్యూసెక్కుల నీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. టెయిల్పాండ్ నీటి నిల్వ సామర్థ్యం 7.080 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.208 టీఎంసీలుగా ఉన్నట్లు పేర్కొన్నారు.