మిర్యాలగూడ రూరల్, ఆగస్టు14 : మండలంలోని యాద్గార్పల్లి గ్రామంలో గల లక్ష్మీచెన్నకేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి చోరి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు గర్భ గుడి తాళాలు పగులగొట్టి వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు. రూరల్ ఎస్ఐ ముత్యం రాంమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం పూజారి గుడికి వచ్చేసరికి గర్భగుడి తాళాలు పగులగొట్టి తెలుపులు తెరచి ఉండడంతో దొంగలు పడ్డారని గ్రహించి దేవాలయ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ దుడిగాల యాదమ్మాశ్రీనివాస్కు సమాచారం ఇచ్చారు.
వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ ఆలయ పరిసరాలను పరిశీలించి వేలిముద్రలను సేకరించారు. మూడు వెండి కిరీటాలు, పద్మపు ఆభరణం, శంకు చక్రం, అమ్మవారి వెండి ఆభరణాలు, శటగోపురం, హారతి ప్లేటు మొత్తం రూ.1.50 లక్షల విలువైన వస్తువులను అపహరించుకుపోయారు. ఆలయ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.