ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో శనివారం వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాల య్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
చివ్వెంల, ఆగస్టు 13 : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా మరొకరికి గాయాలైన ఘటన చివ్వెంల పరిధిలోని బీబీగూడెం శివారులో సూర్యాపేట-ఖమ్మం రహదారిపై శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఎస్ఐ విష్ణు తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండలం తుమ్మలపల్లికి చెందిన గండు హరీశ్(31)లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. డీజిల్ ట్యాంకర్ తీసుకొని చర్లపల్లికి వెళ్తున్నాడు.
బీబీగూడెం వద్ద వాహనాల రద్దీ అధికం కావడంతో వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన లారీ అతివేగంగా డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. దాంతో ట్యాంకర్ ముందున్న ఆటోను, మరో డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. దాంతో హరీశ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్కు చెందిన ఆటో డ్రైవర్ సయ్యద్ అబ్దుల్ రెహమాన్కు తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రుడిని సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. హరీశ్ మృతదేహానికి సూర్యాపేట ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. హరీశ్ భార్య 9 నెలల గర్భవతి. మృతుడి తండ్రి సోమనర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఆలేరు : పట్టణంలోని జాతీయ రహదారిపై శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ రాజధాని బస్సు హైదరాబాద్కు వెళ్తూ మార్గమధ్యంలో ఆలేరు శివారులో రోడ్డుపై నిలిచిపోయింది. దానిని రిపేర్ చేసేందుకు జనగామ డిపోకు చెందిన మెకానిక్లు దండబోయిన నవీన్(45), కె. భరత్ అక్కడికి చేరుకున్నారు. వారు బస్సును రిపేర్ చేస్తుండగా వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇసుక లారీ వెనుక నుంచి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దాంతో బస్సును రిపేర్ చేస్తున్న మెకానిక్ నవీన్ అక్కడికక్కడే మృతి చెందగా భరత్కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. నవీన్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఇద్రిస్ అలి తెలిపారు.
మేళ్లచెర్వు : రెండు బైక్లు ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన ఘటన మండల కేంద్రం శివారులో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రేవూరు గ్రామానికి చెందిన షేక్. హుస్సేన్అలీ తన బైక్పై మేళ్లచెర్వు వచ్చి తిరిగి బయల్దేరాడు. మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న గ్లామర్ బైక్ ఢీకొట్టింది. దాంతో హుస్సేన్అలీ తలకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం దవఖానకు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. అతడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
మఠంపల్లి : మండల కేంద్రంలోని రామాలయం కాలనీ వద్ద రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో మఠంపల్లికి చెందిన వేముల మట్టపల్లి(40)కి తీవ్ర గాయాలయ్యాయి. అతడి కాలు విరగడంతో 108 ద్వారా హుజూర్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సూర్యాపేట జిల్లాకేంద్ర దవాఖానకు తీసుకెళ్లారు.