వెనక్కి తగ్గకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు భగ్గుమంటున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరుతో వినియోగదారులపై అదనపు భారం పడడంతోపాటు డిస్కమ్లు నిర్వీర్యం అవుతాయని, విద్యుత్ పంపిణీ కార్పొరేట్ చేతుల్లోకి వెళ్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పార్లమెంట్లో విద్యుత్ చట్ట సవరణ బిల్లును ప్రవేశ పెట్టడాన్ని నిరసిస్తూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. ఎక్కడికక్కడ తమ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. తక్షణమే బిల్లును వెనక్కి తీసుకోవాలని, విద్యుత్ సంస్థలను కాపాడుతూ ఉద్యోగులు, కార్మిక ప్రయోజనాలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్రం దిగొచ్చే వరకూ పోరాటాలను కొనసాగిస్తామని హెచ్చరించారు. విద్యుత్ ఇంజినీర్లు, ఉద్యోగులు, కార్మికుల ఆందోళనకు పలు ప్రజా, కార్మిక సంఘాల
నుంచి భారీ మద్దతు లభించింది.
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు8(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్మేస్తూ వస్తున్న మోదీ సర్కార్ కన్ను తాజాగా విద్యుత్ రంగంపై పడింది. విద్యుత్ వ్యవస్థను సైతం కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పేందుకు చకచకా అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా సోమవారం పార్లమెంట్లో విద్యుత్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. దీని వల్ల ఇన్నేండ్లుగా ప్రభుత్వ విద్యుత్ సంస్థలు నిర్మించిన లైన్లలో ప్రైవేట్ సంస్థలు సైతం కరెంట్ సరఫరా చేసుకునే వెసులుబాటు లభించనుంది.
దీంతోపాటు డిస్కంలు నిర్వీర్యం కానున్నాయి. పైగా ప్రైవేటు కార్పొరేట్ సంస్థల లాభాపేక్షతో ఇష్టానుసారంగా ప్రజలపై విచ్చలవిడిగా భారాలు మోపనున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో ఇన్నాళ్లు సంస్థల పటిష్టతకు అహర్నిషలు కృషి చేస్తూ వచ్చిన ఇంజినీర్లు, ఉద్యోగుల, ఇతర సిబ్బంది, కార్మికుల ప్రయోజనాలకు కూడా నష్టం వాటిల్లనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్ట సవరణ బిల్లుపై తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఇప్పటికే దీనిపై ఆందోళనలో ఉన్న విద్యుత్ సంఘాలు సోమవారం దేశవ్యాప్తంగా సమ్మెకు దిగాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగానూ పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగాయి.
జిల్లా అంతటా ఇంజినీర్లు, ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు మూకుమ్మడిగా విధులను బహిష్కరించి ఆందోళనలకు దిగారు. నల్లగొండలోని ఎస్ఈ కార్యాలయం వద్ద తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, సిబ్బంది విధులను బహిష్కరించి మహాధర్నా చేపట్టారు. దామరచర్ల మండల పరిధిలో నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో ట్రాన్స్కో అండ్ జెన్కో ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు విధులను బహిష్కరించి మహాధర్నా నిర్వహించారు.
నాగార్జునసాగర్లోని జెన్కో సీఈ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు మహాధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పీఏపల్లి మండలంలోని పుట్టంగండి లిఫ్ట్ ఇరిగేషన్ పంపుహౌస్ వద్ద విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. మిర్యాలగూడ, దేవరకొండ డీఈ కార్యాలయాల ఎదుట కూడా విద్యుత్ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు.
ఇక సూర్యాపేట జిల్లా ట్రాన్స్కో ఎస్ఈ కార్యాలయం ఎదుట ఇంజినీర్ల, ఉద్యోగులు, కార్మికులు మహాధర్నా చేపట్టారు. యాదాద్రిభువనగిరి జిల్లా అంతటా విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు విధులు బహిష్కరించారు. ట్రాన్స్కో ఎస్ఈ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ తీరుపై తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా సంఘాల నేతలు హెచ్చరించారు.
తెలంగాణ పవర్ ఎంప్లాయీస్, ఇంజినీర్ల జాయింట్ యాక్షన్ కమిటీలతోపాటు వివిధ విభాగాల వారీగా సంఘాల ఆధ్వర్యంలో కొనసాగిన విద్యుత్ ఉద్యోగులు ఆందోళనలకు టీఆర్ఎస్కేవీ, సీఐటీయూ, ఏఐటీయూసీ తదితర కార్మిక సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని, రాష్ర్టాలు విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నా కేంద్ర ప్రభుత్వం బిల్లును తీసుకురావడం తీవ్ర ఆక్షేపణీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
కొండమల్లేపల్లి : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ మండల కేంద్రంలోని విద్యుత్ డివిజన్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శించి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో డీఈ శ్రీనివాస్, టెక్నికల్ ఏఈ హర్షవర్ధన్రెడ్డి, జేఏఓ అమర్, సబ్ ఇంజినీర్ శ్రీధర్, రమేశ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్రెడ్డి ఉద్యోగులు పాల్గొన్నారు.
హాలియా : విద్యుత్ సంస్కరణలకు నిరసనగా సోమవారం హాలియా విద్యుత్ సబ్ డివిజనల్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ జేఏసీ నాయకులు జవ్వాజి భిక్షం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉద్యోగులు కొండయ్య, బ్రహ్మాచారి, భిక్షం, శ్రీహరి, కొండల్, నర్సింహ, మెండే జలేందర్ పాల్గొన్నారు.
నల్లగొండ సిటీ : విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని, ఇందుకోసమే విద్యుత్ చట్ట సవరణ బిల్లు తీసుకొస్తున్నదని విద్యుత్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నల్లగొండలోని ఎస్ఈ కార్యాలయం ఎదుట సోమవారం విద్యుత్ సంఘాల ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి ప్లకార్డులు ప్రదర్శించారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకే ఈ బిల్లు తీసుకొస్తున్నదన్నారు. ఇప్పటికే విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ 12 రాష్ర్టాలు తీర్మానం చేసి కేంద్రానికి పంపించాయని తెలిపారు. బిల్లును అడ్డుకోకపోతే బీజేపీ నాయకుల ఇండ్లకు విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో ఎస్ఈ చంద్రమోహన్, డీఈ విద్యాసాగర్ రవికాంత్శర్మ జేఏసీ చైర్మన్ ఎన్. వెంకటయ్య, కన్వీనర్ నాగిరెడ్డి, జేఏసీ నాయకులు సురేశ్కుమార్, కో కన్వీనర్ రాజు, శ్రీనివాస్రెడ్డి, దేవకుమార్, గిరి, వీరబాబు, పర్వేజ్, బషీర్, నరేశ్రెడ్డి, శ్రీనివాస్, ఆంజనేయులు, వెంకట్, హరీశ్కుమార్, గోవర్ధన్, రాజేశ్, రవికుమార్బాబు పాల్గొన్నారు.
విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నది. డిస్కమ్లను పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసి అదానీ, అంబానీలకు అమ్మేందుకు చూస్తున్నది. ఇప్పటికే ఇతర రాష్ర్టాల్లో వ్యవసాయ మోటర్లకు విద్యుత్ మీటర్లు పెడుతుండగా దీన్ని అన్ని రాష్ర్టాల్లో అమలు చేయనున్నది. రైతులు, గృహ వినియోగదారుల మోయలేని భారం పడుతుంది.
– బి.నరేందర్రావు, ఏడీ, నల్లగొండ
విద్యుత్ సవరణ బిల్లు ప్రవేశపెడితే వినియోదారులపై మోయలేని భారం పడుతుంది. బిల్లులు కట్టలేని పరిస్థితి నెలకొంటుంది. ఇప్పటికే చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా 12 రాష్ర్టాలు తీర్మానం చేసి కేంద్రానికి పంపిచాయి. అయినప్పటికీ కేంద్రం ఒంటెద్దు పోకడ పోతున్నది. బిల్లును నిలిపి వేయకపోతే మిలియన్ మార్చ్ తరహాలో ఉద్యమం తప్పదు.
– మాధవాచారి, సబ్ఇంజినీర్, నల్లగొండ
విద్యుత్ చట్ట సవరణ బిల్లు పాసైతే దేశవ్యాప్తంగా ఉన్న 27 లక్షల మంది ఉద్యోగులు రోడ్డునే పరిస్థితి ఏర్పడుతుంది. విద్యుత్ ప్రైవేటీకరణతో పేద, మధ్య తరగతి వర్గాలకు సబ్సిడీ రాదు. ఇప్పటికైనా ఈ బిల్లును నిలిపివేయాలి. లేకుంటే దేశ వ్యాప్తంగా విద్యుత్ నిలిపివేసి ఉద్యమం చేస్తాం.
-రాంమూర్తి, అసిస్టెంట్ ఇంజినీర్, నల్లగొండ
విద్యుత్ బిల్లుతో ఉద్యోగుల హక్కులు హరించిపోతాయి. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణలో భాగంగానే కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తున్నది. కొత్త బిల్లు వస్తే విద్యుత్ రాయితీలు పోతాయి. విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు వెట్టి చాకిరి చేయాల్సి వస్తుంది. డిస్కమ్లన్నీ కార్పొరేట్ సంస్థల ఆధీనంలోకి వెళ్తాయి. ఈ బిల్లును వెంటనే ఉపసహరించుకోవాలి.
– ఏఈ శ్రీను, దామరచర్ల