స్వాతంత్య్ర పోరాట ప్రాశస్త్యం, ఉద్యమ వీరుల స్ఫూర్తి, త్యాగనిరతిని చాటిచెప్పేలా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు జిల్లా సిద్ధమైంది. జాతీయ జెండాలు, మామిడి తోరణాలతో పట్టణాలు ముస్తాబవుతున్నాయి. హెచ్ఐసీసీలో సీఎం కేసీఆర్ సోమవారం శ్రీకారం చుట్టిన వేడుకలకు జిల్లా నుంచి మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్ కుమార్, రవీంద్రకుమార్ ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నల్లగొండ కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. మంగళవారం అన్ని మున్సిపాలిటీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఇంటింటికీ త్రివర్ణ పతాకం అందించనున్నారు.
నల్లగొండ, ఆగస్టు 8: స్వాతంత్య్రోద్యమ ప్రాశస్త్యం, పోరాట యోధుల స్ఫూర్తి, అమరవీరుల త్యాగం నేటి తరానికి తెలి యజేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానునుసారం జిల్లాలో 13 రోజుల జెండా పండుగను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. 1947కు ముందు పరిస్థితులను వివరిస్తూ అహింసాయుత మార్గంలో స్వాతంత్య్రాన్ని సాధించిన మహాత్మాగాంధీ పోరాట స్ఫూర్తిని నేటి తరానికి అందించేందుకు ఈ వజ్రోత్సవాలు దోహద పడను న్నాయి.
తొలి రోజు సోమవారం హైదరాబాద్లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో వేడుకలు షురూ కాగా ఈనెల 21 వరకు నిరంతరంగా జరగనున్నాయి. అహింసాయుత పోరాటమే కఠినతరమైనదని అటువంటి పోరాటాన్ని ఎంచుకొని భారత దేశాన్ని విజయ తీరాలకు చేర్చిన మహాత్మాగాంధీ గురించి వివరించటం.. స్వాతంత్య్ర సమరయోదులు పడిన శ్రమను నేటి తరానికి తెలియచేయనున్నారు. ప్రతి ఇంటి మీద రెపరెపలాడే తిరంగా జెండా వర్తమానంలో స్వాతంత్య్రోద్యమ చరిత్ర బోధపడేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు.
తిప్పర్తి : మంగళవారం నుంచి నిర్వహించనున్న స్వాతంత్య్ర వజ్రోత్సవ సంబురాలపై మండలకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు సొమవారం అవగాహన కల్పించారు. తిప్పర్తి సర్పంచ్ రొట్టెల రమేశ్, ప్రధానోపాధ్యాయురాలు వెంకటమ్మ మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం పోరాటాలు చేసి ప్రాణత్యాగం చేసిన నాయకుల గురించి వివరించారు. పొరాటాల ద్వారా స్వాతంత్య్ర ఫలాలను అందించిన మహనేతలను కొనియాడారు. స్వాత్ంరం దినోత్సవ సంబురాలు జరుపుకోవాలని తల్లిదండ్రులకు చెప్పాలని కోరారు. ఉపాధ్యాయుడు సదానందం పాల్గొన్నారు.
స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలకు మండలంలోని అన్ని ఇండ్ల పై ఎగుర వేయడానికి జాతీయ జెండాలను తిప్పర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీ డీఓ మహేందర్ రెడ్డి సోమవారం జెండాలను పంచాయతీలకు పంపిణీ చేశారు. కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
నకిరేకల్ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలకు నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్ బయల్దేరారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీ మాదాపూర్ ప్రాంగణంలో సోమవారం జరిగిన వజ్రోత్సవాల్లో నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
రామగిరి : నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా సోమవారం వర్సిటీలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. జాతీయ సమైక్యతను చాటేలా విద్యార్థులు వేసిన ముగ్గుల పోటీలు ఆలరించాయి. ముగ్గులను వీసీ ప్రొ॥ సీహెచ్ గోపాల్రెడ్డి పరిశీలించి విద్యా ర్థినులకు అభినందనలు తెలిపారు. అనంతరం వీసీ మాట్లాడుతూ జాతీయ భావం పెంచేలా కృషి చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలోఎంజీయూ ఓఎస్డీ డాక్టర్ అల్వాల రవి, ఆడిట్ సెట్ డైరెక్టర్ అంజిరెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లం మల్లేశ్ పాల్గొన్నారు.
హాలియా : స్వాతంత్య్ర వజ్రోత్సవాలను హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ పార్వతమ్మాశంకరయ్య పిలుపునిచ్చారు. సోమవారం ఆమె హాలియాలో మాట్లాడుతూ దేశ సమైక్యత చాటాలన్నారు.
తిరుమలగిరి సాగర్ : హైదరాబాద్లో సోమవారం నిర్వహించిన స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో మండల ఎంపీపీ ఆంగోతు భగవాన్ నాయక్, జడ్పీటీసీ సూర్య బాషనాయక్ పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ తరి రాము మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ఎంతోమంది మహనీయులు తమ ప్రాణాలు త్యాగం చేశారని కొనియాడారు. ప్రతి విద్యార్థి స్వాతంత్య్ర దినోత్సవ ఆవశ్యకతను తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రవణ్కుమార్రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ నాగయ్య, ఉపాధ్యాయులు మధు, పార్వతమ్మ, రాయల్కుమారి, చంద్రకళ, మోతీలాల్, జగన్, రెడ్యానాయక్ పాల్గొన్నారు.