నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ కలెక్టర్గా 2013 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన టి.వినయ్క్రిష్ణారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు సూర్యాపేట
కలెక్టర్గా పని చేస్తున్న ఆయన నల్లగొండకు బదిలీపై రానున్నారు. నల్లగొండ కలెక్టర్గా పూర్తి అదనపు
బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాహుల్ శర్మ నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. రాహుల్శర్మ ఎప్పటిలాగే నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా కొనసాగనున్నారు.
కొద్దిరోజుల కిందట ప్రశాంత్ జీవన్ పాటిల్ నల్లగొండ నుంచి సిద్దిపేట జిల్లాకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో పూర్తి అదనపు బాధ్యతలతో కలెక్టర్గా రాహుల్శర్మ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, సూర్యాపేట కలెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ను ప్రభుత్వం నియమించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన అక్కడ కలెక్టర్గా కొనసాగనున్నారు. సూర్యాపేట కలెక్టర్గా వినయ్క్రిష్ణారెడ్డి 2020 ఫిబ్రవరి 3న బాధ్యతలు చేపట్టారు. రెండు సంవత్సరాల ఐదు నెలల పాటు సూర్యాపేట జిల్లాలో తనదైన మార్క్తో పని చేశారు.
నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్గా పని చేస్తున్న వనమాల చంద్రశేఖర్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో జనగామ జిల్లా అదనపు కలెక్టర్గా పని చేస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఏ భాస్కర్రావును తీసుకొస్తున్నది. నల్లగొండ ఆర్డీఓ ఎన్.జగదీశ్వర్రెడ్డిని కూడా ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 2018 సెప్టెంబర్ నుంచి ఇక్కడ ఆర్డీఓగా పని చేస్తున్న ఆయన స్థానంలో ఆర్డీఓగా ఏఎమ్మార్పీ యూనిట్-1లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పని చేస్తున్న కేఎం జగన్నాథరావును నియమించింది.
అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ జిల్లాలో సుదీర్ఘకాలం పని చేశారు. ఆయన 2018 సెప్టెంబర్లో తొలిసారిగా జడ్పీ సీఈఓగా జిల్లాకు వచ్చారు. అనంతరం 2019 మే 7న అదనపు కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. 3 సంవత్సరాల 3 నెలల పాటు పని చేసిన చంద్రశేఖర్ మధ్యలో జిల్లా కలెక్టర్గా నెలన్నర పాటు పూర్తి అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులు, సీఎంఆర్ సేకరణలో నల్లగొండ జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు.
కొవిడ్ సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇబ్బందుల్లేకుండా ధాన్యం, పత్తి కొనుగోళ్లతోపాటు ధరణి పోర్టల్, రెవెన్యూ సమస్యల పరిష్కారంలోనూ సక్సెస్ పుల్గా ముద్ర వేసుకున్నారు. ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు కృషి చేశారు. ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి కూడా చాలాకాలంగా బాధ్యతలు నిర్వహిస్తూ సమర్ధవంతమైన అధికారిగా ముద్ర వేసుకున్నారు. నల్లగొండ ఆర్డీఓతో పాటు జిల్లా రెవెన్యూ అధికారిగానూ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తదిపరి పోస్టింగ్ కోసం వీరిద్దరినీ రెవెన్యూ కార్యదర్శి వద్ద రిపోర్ట్ చేయాలని బదిలీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.