సూర్యాపేట సిటీ, ఆగస్టు 8 : సూర్యాపేట జిల్లాలో వేర్వేరు చోట్ల రూ.38లక్షల విలువైన 377 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సోమవారం మునగాల, పాలకవీడు, చిలుకూరు పోలీస్స్టేషన్ల పరిధిలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు.
ఈ సమయంలో కార్లలో గంజాయిని తరలిస్తుండగా పట్టుకొని 9 మందిని అరెస్టు చేశారు. మునగాల పీఎస్ పరిధిలో ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్కు చెందిన అర్షిత్ మాలిక్, ప్రియాంక్గాంధీ, గీతాసేన్, ఉత్తరప్రదేశ్కు చెందిన తనుష్క మాలిక్, ఒడిశాకు చెందిన రాజును నిందితులుగా గుర్తించారు. వారి వద్ద రూ.6లక్షల విలువైన 165కిలోల గంజాయి, రెండు కార్లు, 4సెల్ఫోన్లు, రూ.1500 నగదు స్వాధీనం చేసుకున్నారు. పాలకవీడు పీఎస్ పరిధిలో మహారాష్ట్రకు చెందిన విజయ్ అసరం గోర్పడే, సీససత్ ప్రదీప్, బాలా, మల్లేశ్ను నిందితులుగా గుర్తించారు.
వారి వద్ద నుంచి 85 ప్యాకెట్లలో 182 కిలోల గంజాయి, రెండు సెల్ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. చిలుకూరు పీఎస్ పరిధిలో ఒడిశాకు చెందిన సుభాష్ హంతల్, సురేశ్ ఖార, మంగ్ల మండి, ఆంధ్రప్రదేశ్కు చెందిన జీనా, హైదరాబాద్కు చెందిన సంతోష్ను నిందితులుగా గుర్తించారు. వారి వద్ద నుంచి 30కిలోల 380గ్రాముల గంజాయి, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మూడు కేసుల్లో కేసుల్లో అర్షిత్ మాలిక్, ప్రియాంక్, తనుష్క మాలిక్, గీతాసేన్, విజయ్ ఆసరం గోర్పడే, సీససత్ ప్రదీప్, సుభాశ్ హంతల్, సురేశ్ ఖార, మంగ్లిమండిని అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరిచినట్లు ఎస్పీ తెలిపారు. మిగతా ఆరుగురు పరారీలో ఉన్నట్లు చెప్పారు. సమావేశంలో డీఎస్పీలు వెంకటేశ్వర్రెడ్డి, నాగభూషణం, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.