సూర్యాపేట సిటీ, ఆగస్టు 8 : సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణంలోని తాళ్లగడ్డకు చెందిన చందనబోయిన కోటయ్య కుమారుడు దిలీప్ (19) పట్టణంలో ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతూ ఏసీ మెకానిక్గా పని చేస్తున్నాడు. అదే కాలనీకి చెందిన ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు.
వారి ప్రేమ వ్యవహారం తెలిసిన యువతి సోదరుడు ఆదివారం రాత్రి దిలీప్కు ఫోన్ చేసి మాట్లాడుకుందామని పట్టణంలోని సద్దుల చెరువు వద్దకు రమ్మన్నాడు. అక్కడ దిలీప్పై దాడి చేసి బీరు సీసాతో గొంతులో పొడిచి హత్య చేసినట్లు మృతుడి తండ్రి కోటయ్య ఆరోపిస్తున్నాడు. తాళ్లగడ్డకు చెందిన శ్రీమాన్, తండు పవన్పై అనుమానం ఉన్నట్లు పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. తమ కులం కాని వాడు తన సోదరిని ప్రేమిస్తున్నాడనే కక్షతోనే హతమార్చినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కోటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు.