యాదాద్రి, ఆగస్టు 5 : ఇచ్చిన హామీని నిలబెట్టుకునే గొప్ప మనస్సున్న మహారాజు సీఎం కేసీఆర్ అని ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డి కొనియాడారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా అంజనాపురి కాలనీకి చెందిన ఇండ్లు కోల్పోయిన వారికి యాదగిరిగుట్ట ఎంపీడీఓ కార్యాలయంలో లాటరీతో శుక్రవారం ప్లాట్లను కేటాయిచారు.
సర్వే నంబర్ 314లో అందరికీ ప్లాట్లు కేటాయించినట్లు తెలిపారు. బాధితుల ప్లాట్లలో ఇళ్లు నిర్మించేందుకు మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. విద్యుత్, తాగునీటి వసతి, డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి చేసి ఇస్తామన్నారు ఎంతో అద్భుతమైన ప్రాంతంలో ఇండ్ల స్థలాలు కేటాయించామని, రాబోయే రోజుల్లో ఆ ప్రాంతం ఒక గొప్ప ప్రదేశంగా మారుతుందని అన్నారు. కార్యక్రమంలో చైర్పర్సన్ ఎరుకల సుధాహేమేందర్గౌడ్, జడ్పీటీసీ అనూరాధ, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పెలిమెల్లి శ్రీదర్గౌడ్, అంజనాపురి కాలనీ బాధితులు పాల్గొన్నారు.
ఆలేరు : పట్టణ కేంద్రంలోని రైల్వే అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న 57మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఇన్చార్జి తాసీల్దార్ జయమ్మ శుక్రవారం ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ పట్టణంలో ఎన్నో ఏండ్లుగా రైల్వేగేట్ ఊరి మధ్యలో ఉండడంతో గ్రామాలకు వెళ్లాలంటే ఇబ్బందయ్యేదన్నారు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా రెండేండ్ల క్రితం అండర్పాస్కు శంకుస్థాపన చేశారు. అండర్పాస్ నిర్మాణంతో 57మంది ఇళ్లు, షాపులు కోల్పోతున్నట్లు గుర్తించామని తెలిపారు.
57మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు, ఆర్అండ్బీ శాఖ నుంచి నిర్మాణ ఖర్చు ఇప్పించాలని కలెక్టర్ను కోరగా అంగీకరించారు. ఈ మేరకు 57మంది లబ్ధిదారులకు 46మ ందికి ప్లాట్ల పట్టాలు అందించారు. 11మంది దస్తావేజులు సరిగ్గా లేని కారణంగా వారికి అతి త్వరలోనే ఇస్తామని హామీనిచ్చారు. మునుగోడులో ఉప ఎన్నిక ఎప్పుడొచ్చినా వచ్చినా టీఆర్ఎస్నే గెలుస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, వైస్ చైర్మన్ మొరిగాడి మాధవీవెంకటేశ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పుట్ట మల్లేశ్, పీఏసీఎస్ చైర్మన్ మొగులగాని మల్లేశ్, కౌన్సిలర్లు రాయపురం నర్సింహులు, నాయకులు బాలస్వామి, దాసి సంతోష్ పాల్గొన్నారు.