నింపుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఏడో విడుతకు సిద్ధమవుతున్నది. వరుస వర్షాలు, వరదలతో నిండుకుండలా తొణికిసలాడుతున్న నీటి వనరుల్లో చేప పిల్లలను పోసేందుకు మత్స్యశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 9 రిజర్వాయర్లతోపాటు 3,100 చెరువులను గుర్తించి, ఈ వారం నుంచే చేపపిల్లలను వదులనున్నది. ఆ మేరకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయ్యింది. ఆయా చెరువుల్లో మొత్తం 13.11 కోట్ల సీడ్ అవసరం ఉండగా, ప్రభుత్వం దాదాపు రూ.12.75 కోట్లు వెచ్చిస్తున్నది.
సర్కారు సాయాన్ని ఉపాధిగా మార్చుకుని మత్య్సకారులు ఆర్ధికంగా నిలదొక్కుకుంటున్నారు. మత్స్య అభివృద్ధి పథకంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే రాయితీపై వలలు, పడవలు, మోపెడ్లు అందించిన సంగతి తెలిసిందే. కులవృత్తులకు జీవం పోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలు తీసుకొచ్చి చేయూతనిస్తున్నది. అందులో భాగంగా మత్య్సకారుల కుటుంబాలకు జీవనోపాధి పెంపొందించేందుకు ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్నది.
ఇప్పటికే ఆరు దఫాలుగా జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు పోసిన సర్కార్ ఈ సారి కూడా అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు అధికార యంత్రాంగం ప్రణాళిక రూపొందించింది. నల్లగొండ జిల్లాలో ఈ ఏడాది 1359 చెరువుల్లో 6.30 కోట్ల ఫిష్ సీడ్ పోయడానికి ప్రభుత్వం రూ.5.70 కోట్లు కేటాయించింది. సూర్యాపేట జిల్లాలో 850 పైగా చెరువుల్లో 3.65 కోట్ల చేపపిల్లలకు రూ.4.5 కోట్లు.. యాదాద్రి భువనగిరి జిల్లాలో 900 చెరువుల్లో 3.16 కోట్ల చేప పిల్లలకు
రూ.3 కోట్లు విడుదల చేసింది.
ఈ సారి నైరుతి రుతుపవనాలు కొంత ఆలస్యమైనప్పటికీ ఊహించని స్థాయిలో వర్షాలు కురువడంతో సింహభాగం చెరువులు మత్తడి దుంకుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశానుసారం నల్లగొండ జిల్లా మత్స్యశాఖ యంత్రాంగం చేప పిల్లల కోసం ఇటీవల టెండర్లు స్వీకరించగా మొత్తంగా తొమ్మిది మంది వేశారు. అందులో ఎల్ 1 నుంచి ఎల్ 3 వరకు ప్రాధాన్యతను బట్టి చేప పిల్లలు పోసే సామర్థ్యాన్ని బట్టి కాంట్రాక్టర్ను ఎంపిక చేస్తారు. ఈ సారి ఎల్ 1 కాంట్రాక్టర్ రూ.1.29కి టెండర్ కోట్ చేశాడు. అదే ప్రైస్కి మరో ఆరుగురు కాంట్రాక్టర్లు సైతం ముందుకు రావటంతో వారి సామర్థ్యాన్ని బట్టి టెండర్ ఫైనల్ చేస్తూ జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది.
నల్లగొండ జిల్లాలో నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో 1971 చెరువులు ఉన్నాయి. అందులో చిన్నకుంటలు పోగా గ్రామ పంచాయతీ చెరువులతో కలిపి మత్య్సశాఖ పరిధిలో 1350 చెరువులు ఉన్నాయి. వీటిలో తొమ్మిది రిజర్వాయర్లు ఉండగా మిగిలినవి చిన్న తరహా నుంచి పెద్ద తరహా చెరువులే. ఇందులో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు పోయడానికి 6.30 కోట్ల చేపపిల్లలు అవసరమని మత్య్స శాఖ ప్రతిపాదనలు పంపింది. దానికి అనుగుణంగా సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీనికి సంబంధించి మత్స్యశాఖ టెండర్లు నిర్వహించగా కాంట్రాక్టర్లు చేసిన కోట్ ప్రకారం 6.30 కోట్ల చేప పిల్లలకు ప్రభుత్వం రూ.5.70 కోట్లు వెచ్చిస్తున్నది. చిన్న పిల్లలు 35 ఎంఎం నుంచి 40 ఎంఎం వరకు, పెద్ద పిల్లలు 80 ఎంఎం నుంచి 100 ఎంఎం వరకు సైజ్తో పోయాల్సి ఉంది. ఈ చేప పిల్లలను వచ్చే వారం నుంచి అక్టోబర్ చివరి నాటికి జిల్లాలోని 1350 చెరువుల్లో పోసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో 900 చెరువుల్లో ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయించి 3.16 కోట్ల చేపపిల్లలను విడుదల చేయనున్నది. జిల్లాలో 134 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు, 10 మహిళా మత్య్సపారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా 8,929 మంది జీవనోపాధి పొందుతున్నారు.
సూర్యాపేట జిల్లాలో ఈ ఏడాది 3.65 కోట్ల చేపపిల్లలను చెరువుల్లో వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం చేపట్టిన టెండర్ల ప్రక్రియ తుదిదశకు చేరింది. జిల్లాలో 144 మత్స్య సహకార సంఘాల్లో 15వేల మందికిపైగా మత్స్యకారులు చేపల ఉత్పత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. గతేడాది 976పైగా చెరువుల్లో 4.23 కోట్ల చేప పిల్లలను ప్రభుత్వం వదిలింది. ఈ సారి రిజర్వాయర్లతోపాటు 850కిపైగా చెరువుల్లో 3.65కోట్ల చేప పిల్లలను వదిలేందుకు రూ.4.5 కోట్లు కేటాయించింది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా ఫిష్ సీడ్ కోసం రూ.12కోట్ల నుంచి రూ. 15 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఏటా రూ.700 కోట్ల ఆదాయం మత్య్సకారులకు సమకూరుతున్నది. ఉమ్మడి జిల్లాలో 4,400 చెరువులు ఉండగా అందులో మత్స్యశాఖ చెరువులు 2,900 ఉన్నాయి. ఈ చెరువులతోపాటు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్, మూసీ, అక్కంపల్లి, ఉదయ సముద్రం, ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో చేపలు లభ్యమవుతున్నాయి.
మన చెరువుల్లో బొచ్చ, రవ్వ, కట్ల, కొర్రమట్ట, మోసు, బురకలు, పాంప్లెంట్లు, మార్పులు, బంగారుతీగతో పాటు ఫ్రాన్స్ రకం చేపలు ఉన్నాయి. వీటిని మన మత్య్సకారులు ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. వీటితో ప్రతియేటా వచ్చే సంపదతో మత్య్స కారులకు నెలకు సగటున రూ.30వేల నుంచి 45వేల వరకు ఆదాయం చేతికి వస్తున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 424 గుర్తింపు సంఘాలు ఉండగా అందులో 43,700 మంది సభ్యులు ఉన్నారు.
ఈ వానకాలంలో 9 రిజర్వాయర్లు, 1341 చెరువుల్లో చేప పిల్లలు పోసేందుకు ఏర్పాట్లు చేశాం. టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో వారం రోజుల్లో చేపలు పోసే ప్రక్రియ ప్రారంభిస్తాం. జిల్లాలో 6.30 కోట్ల చేప పిల్లలు అవసరంగా కాగా అందుకు అన్నీ సిద్ధం చేశాం. గతేడాది పోసిన చేపలు బాగా ఎదుగడంతో మత్య్సకారులకు మంచి ఆదాయం వస్తున్నది.
-వెంకయ్య, నల్లగొండ జిల్లా మత్య్సశాఖ అధికారి
వర్షాలతో జిల్లాలో చెరువులు నిండాయి. టెండర్ ప్రక్రియ పూర్తికాగానే చెరువుల్లో చేప పిల్లలను వదలుతాం. అందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. మత్య్సకారులు మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దు. ప్రభుత్వం అందించే చేప పిల్లలను ఉచితంగా పొందవచ్చు.
– ఎం .సౌజన్య, సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి