కలకలం రేపిన కాల్పుల ఘటన దాదాపు కొలిక్కి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడైన నార్కట్పల్లి మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సుఫారీ గ్యాంగ్కు చెందిన మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు స్వామిపై గతంలోనూ ఇలాంటి దాడి చేయించినట్లు విచారణలో తేలింది. స్వామి ఫిర్యాదు మేరకు మాల్కు చెందిన మరో ఇద్దరి పైనా హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
మునుగోడు, ఆగస్టు 5 : మునుగోడు మండలంలోని ఊకొండి క్రాస్రోడ్డు వద్ద గురువారం రాత్రి ఓ వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై చండూరు సీఐ అశోక్రెడ్డి శుక్రవారం దర్యాప్తు చేపట్టారు. ఎస్ఐ సతీశ్రెడ్డి, క్లూస్టీం సాయంతో కాల్పులు జరిగిన స్థలాన్ని పరిశీలించి పలు ఆధారాలు సేకరించారు. బుల్లెట్ షెల్స్, బాధితుడి బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామానికి చెందిన నిమ్మల స్వామి గతంలో సొంతంగా డోజర్ కొని నడిపేవాడు. అందులో నష్టం రావడంతో గత ఏప్రిల్లో మునుగోడులో బెయిలీ వాటర్ బాటిల్స్ డీలర్షాప్ను ప్రారంభించాడు.
రోజూ నార్కట్పల్లి, మునుగోడు మండలాల్లో వాటర్బాటిల్స్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాడు. గురువారం రాత్రి రోజువారీ పనులు ముగించుకుని 8 గంటలకు బైక్పై స్వగ్రామానికి బయల్దేరాడు. సరిగ్గా ఊకొండి క్రాస్రోడ్డు వద్దకు రాగానే బైక్పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు స్వామిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. సమీపంలో ఉన్నవారు కాల్పుల శబ్ధం విని రావడంతో నిందితులు పరారయ్యారు. స్వామికి తీవ్ర గాయాలు కావడంతో నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు.
అతడి శరీరంలోకి దూసుకెళ్లిన రెండు బుల్లెట్లను వైద్యులు శస్త్ర చికిత్స చేసి బయటకు తీశారు. మరొక బుల్లెట్ స్వామి చేతిలోంచి బయటకు దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తులు ఎవరని బంధువులు ఆరాతీయగా మాల్కు చెందిన గిరి, వెంకటేశ్వర్లు అని బాధితుడు చెప్పాడు. ఫిర్యాదు మేరకు కాల్పులకు పాల్పడిన మాల్కు చెందిన నిందితులు రామలింగం, గిరిలపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సతీశ్రెడ్డి తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
నార్కట్పల్లి : నిమ్మల స్వామిపై కాల్పుల ఘటనలో స్వామి భార్యను డీఎస్పీ, స్పెషల్ టాస్క్పోర్స్ పోలీసులు విచారించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ క్రమంలో నార్కట్పల్లి మండలంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉపాధ్యాయుడి పాత్ర ఉందన్న కీలక సమాచారం పోలీసులకు తెలిసింది. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా స్వామిని హతమార్చేందుకు హైదరాబాద్కు చెందిన ఇద్దరికి సుపారీ ఇచ్చినట్లుగా తెలిపాడు. ఆ ఇద్దరు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా స్వామిపై ఉపాధ్యాయుడు ఇలాంటి దాడే చేయించాడు.