భువనగిరి కలెక్టరేట్, జూన్ 30 : పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి సమగ్ర చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్ర విద్యా శాఖ జాయింట్ సెక్రటరీ హరితతో కలిసి జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్లు, సహాయక ఇంజినీర్లు, డీఈఈలు, ఈఈలు, ఎంఈఓలు, మండల ఎంఐఎస్ కో ఆర్డినేటర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, పనుల పురోగతి, సాంకేతిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. గ్రామాల్లో పాఠశాలల పనుల పురోగతిని ఎప్పటికప్పుడు మండల విద్యాధికారులు పరిశీలిస్తున్నారని, పనులకు సర్పంచులు, ఎస్ఎంసీ చైర్మన్లు సహకారం అందిస్తున్నారని తెలిపారు. పనుల నాణ్యతను డీఈఈలు పరిశీలిస్తున్నారని, నాణ్యతలో రాజీపడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, సమగ్ర శిక్షణ ప్రాజెక్ట్ సహాయ రాష్ట్ర పథక సంచాలకులు రమేశ్, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి, సహాయ సంచాలకులు ప్రశాంత్రెడ్డి, సూపరింటెండెంట్ కృష్ణారెడ్డి, ప్లానింగ్ కో ఆర్డినేటర్ ఎన్.ఆండాలు, క్యాలిటీ కో ఆర్డినేటర్ శ్రీనివాస్, జెండర్ ఈక్విటీ కో ఆర్డినేటర్ నిర్మలజ్యోతి పాల్గొన్నారు.
తుర్కపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాఠశాలల అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ జాయింట్ సెక్రటరీ హరిత సూచించారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంతోపాటు గోపాలపురం ప్రాథమిక పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో జరుగుతున్న పనుల పురోగతిని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
తరగతి గదులు, హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నారు. ఆమె వెంట డీఈఓ నర్సింహ, ఏఎస్పీడీలు నారాయణరెడ్డి, రమేశ్, అదనపు డైరెక్టర్ రమణకుమార్, డైరెక్టర్ సోమిరెడ్డి, మోడల్ స్కూల్ అదనపు డైరెక్టర్లు ఉషారాణి, సరోజినీదేవి, శ్రీనివాస్, జోసఫ్, ఆర్జేడీ ఆండాలు, ఎంఈఓ కృష్ణ, తుర్కపల్లి సర్పంచ్ పడాల వనితాశ్రీనివాస్, ఎస్ఎంసీ చైర్మన్ లక్ష్మి, ప్రధానోపాధ్యాయులు శేషగిరిరావు, మదన్మోహన్, ఎండీ యాకూబ్ ఉన్నారు.