నల్లగొండ, జూన్ 30 : పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురుకుల పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు 56 పాఠశాలలు ఉండగా వాటిలో 4,250 మంది హాజరు కాగా 4,183 (98.42శాతం) మంది విద్యార్దులు ఉత్తీర్ణత పొందారు. 25 పాఠశాలల విద్యార్థులు 100 శాతం ఫలితాలు సాధించారు. ఆయా పాఠశాలలో 118 మంది విద్యార్థులు 10 జీపీఏ పొందారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.1.25 లక్షలు వెచ్చించి నిష్ణాతులైన ఉపాధ్యాయులతో బోధన చేస్తున్నందునే ఈ ఫలితాలు వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. .
మైనార్టీలో అనుముల, సూర్యాపేట (బాలుర), ఆలేరు, నకిరేకల్ (బాలిక), ఎస్టీలో దామరచర్ల, పెద్దవూర (బాలుర), దామరచర్ల (బాలికలు)లు, ఎస్సీలో డిండి, నిడమనూరు, మట్టంపల్లి, మిర్యాలగూడ, ఇమాంపేట, హుజూర్నగర్ (బాలుర), నకిరేకల్ (బాలికలు), బీసీలో నాగార్జునసాగర్, మూసీ, నేరేడుచర్ల, నాగారం బాలుర, మోటకొండూరు, నెమ్మికల్, అనంతగిరి, మునుగోడు, చందుపట్ల, దామరచర్ల, తుమ్మడం బాలికల పాఠశాలల విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించారు.