నేరేడుచర్ల, జూన్ 25 : సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు విడుదల చేసిన రూ.40కోట్లతో హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు మున్సిపాలిటీలు నూతన శోభను సంతరించుకోనున్నాయి. హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించారు.
హుజూర్నగర్ మున్సిపాలిటీకి రూ.25కోట్లు, నేరేడుచర్ల మున్సిపాలిటీకి రూ.15కోట్లు, ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20లక్షలు, మండల కేంద్రానికి రూ.30లక్షలు ప్రకటించిన విషయం విదితమే. మున్సిపాలిటీలకు కేటాయించిన నిధులతో నూతనంగా ఏర్పడిన నేరేడుచర్ల మున్సిపాలిటీలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోగా హుజూర్నగర్ మున్సిపాలిటీలో మరిన్ని అభివృద్ధి పనులకు ఈ నిధులు దోహదపడుతున్నాయి. ఈ నిధుల వినియోగంపై ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించి అభివృద్ధే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు.
అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నాయకులు కోర్టుల్లో కేసులు వేసినా వాటిని పరిష్కరించుకని అభివృద్ధి పనులు చేపడుతున్నారు. నేరేడుచర్ల, హుజూర్నగర్ మున్సిపాలిటీల్లో లేఅవుట్లతో వచ్చిన భూములతో పాటు ప్రభుత్వ భూముల్లో క్రీడా ప్రాంగణం, పార్కులు, నర్సరీలు, ఆటోనగర్ల నిర్మాణం, బంజారా భవన్, సమీకృత మార్కెట్లు నిర్మిస్తున్నారు. దీనికి తోడు మిర్యాలగూడ- కోదాడ ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా నేరేడుచర్ల, హుజూర్నగర్ పట్టణంలో ప్రధాన రహదారిని 100 అడుగుల మేరకు విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తుండడంతో రెండు మున్సిపాలిటీలు అందంగా కనివిందు చేయనున్నాయి. ఎమ్మెల్యే సైదిరెడ్డి విన్నపానికి స్పందించిన పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలకు కలిపి మరో రూ.20కోట్లు కేటాయించారు. దీంతో మున్సిపాలిటీలు మరింత అభివృద్ధి చెందనున్నాయి.
లింగగిరి జంక్షన్ నుంచి మఠంపల్లి జంక్షన్ వరకు డ్రైనేజీల నిర్మాణానికి రూ.2 కోట్ల 59లక్షల15వేలు, లింగరి జంక్షన్ నుంచి మఠంపల్లి జంక్షన్ వరకు సింగిల్ ఆమ్ లైటింగ్కు రూ.39.15లక్షలు, ఇందిరాచౌక్ నుంచి పీఎస్ఆర్ సెంటర్ వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.4కోట్ల 45లక్షల 15 వేలు, పీఎస్ఆర్ సెంటర్ నుంచి మఠంపల్లి జంక్షన్ వరకు బీటీ రోడ్డుకు రూ.1కోటి 13లక్షల 15వేలు, సింగిల్ ఆమ్ లైటింగ్ గాంధీపార్కు నుంచి మఠంపల్లి జంక్షన్, అనుములగూడెం రోడ్డు వరకు రూ.52.15లక్షలు.
గాంధీ పార్కు నుంచి మేళ్లచెర్వు జంక్షన్, గోవిందాపురం బీటీ రోడ్డుకు రూ.98.15లక్షలు, గాంధీపార్కు నుంచి మేళ్లచెర్వు జంక్షన్, గోవిందాపురం వరకు సింగ్ల్ ఆమ్ లైటింగ్కు రూ.34.15లక్షలు, తేజ టాలెంట్ స్కూల్ నుంచి బైపాస్ రోడ్డు వరకు సీసీరోడ్డుకు రూ.87.15లక్షలు, తేజ టాలెంట్ స్కూల్ నుంచి బైపాస్రోడ్డు వరకు సింగిల్ ఆమ్ లైటింగ్కు రూ.39.15 లక్షలు, మిర్యాలగూడెం రోడ్డు నుంచి ఎన్నెస్పీ క్యాంప్ వరకు సీసీరోడ్డుకు రూ.83.15 లక్షలు, మిర్యాలగూడెం రోడ్డు నుంచి ఎన్ఎస్పీ క్యాంపు వరకు సింగిల్ ఆమ్ లైటింగ్కు రూ.39.15 లక్షలు, హుజూర్నగర్ మెయిన్ రోడ్డు నుంచి ఎన్నెస్పీ క్యాంపు వరకు సీసీరోడ్డుకు రూ.29.15లక్షలు, ఇంటిగ్రేటెడ్ (వెజ్ -నాన్) మార్కెట్, పండ్లు -పువ్వులు ఎన్నెస్పీ క్యాంపునకు రూ.6 కోట్ల 48 లక్షల 15 వేలు, ఇంటి గ్రేటెడ్ మార్కెట్లో సింగ్ల్ ఆమ్ లైటింగ్కు రూ.22.15లక్షలు, నూతన గ్రంథాలయ నిర్మాణానికి రూ.82.15లక్షలు, వీధి వ్యాపారులకు షెడ్ల నిర్మాణానికి రూ.94.15 లక్షలు, ఎన్నెస్పీ క్యాంపులోని పార్కు అభివృద్ధికి రూ.1కోటి 15లక్షల 15 వేలు, 300ఎంఎం డీవన్ కె సెవెన్ పైపులైన్ల నిర్మాణం పీఎస్ఆర్ సెంటర్ నుంచి హుజూర్నగర్ మున్సిపాలిటీ వరకు రూ.88.15లక్షలు, బీటీ రోడ్డు లింగగిరి జంక్షన్ నుంచి బైపాస్ రోడ్డు వరకు రూ.1కోటి 31లక్షల15 వేలు కేటాయించారు. మొత్తం 25 కోట్లతో చేపట్టిన పనులు వేగవంతంగా సాగుతున్నాయి.
నేరేడుచర్ల ప్రధాన కూడలి నుండి జాన్పహాడ్ రోడ్డులోని పెట్రోల్ బంక్ వరకు బీటీ రోడ్డు కోసం రూ.2.35కోట్లు, సెంట్రల్ డివైడర్, లైటింగ్ కోసం రూ. 68లక్షలు, డ్రైనేజీ కోసం రూ.2కోట్లతో పనులు చేపట్టనున్నారు. సెంటర్ నుంచి శాంతినగర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.1.30కోట్లు, డ్రైనేజీ కోసం రూ.1కోటి, లైటింగ్కు రూ.40లక్షలు, సెంటర్ నుంచి పాత నేరేడుచర్ల వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 87లక్షలు, డైనేజీ కోసం రూ. 1.32 కోట్లు, లైటింగ్కు రూ.38లక్షలు, తాసీల్దార్ కార్యాలయం నుంచి రామాపురం రోడ్డు వరకు రూ.1.26కోట్లు, లైటింగ్కు రూ.22లక్షలు. హిందూ శ్మశానవాటిక నిర్మాణానికి రూ.70లక్షలు కేటాయించారు.
మొత్తం 15కోట్లతో నేరేడుచర్ల మున్సిపాలిటీలోని ప్రధాన రోడ్లను సుందరంగా తీర్చిదిద్దడానికి పనులను శరవేగంగా చేపడుతున్నారు. రెండు మున్సిపాలిటీలకు మరో రూ.20కోట్లు ఇటీవల మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మున్సిపాలిటీలో ఏర్పాటు చేసే లే అవుట్ల ద్వారా వచ్చిన స్థలాల్లో క్రీడా ప్రాంగణాలు, పార్కులు, నర్సరీలు, ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నారు. అంతేగాకుండా అంతర్గత రహదారులను సైతం అభివృద్ధి చేయడంతో పాటు అవసరమైన చోట నూతనంగా సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపడుతున్నారు.
నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నా. ప్రస్తుతం నేరేడుచర్ల, హుజూర్నగర్ మున్సిపాలిటీలకు సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.40కోట్లతో చేపట్టిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి సహకారంతో ఇప్పటి వరకు రూ.3500కోట్ల నిధులు తెచ్చి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టాం. గత ప్రభుత్వాల పాలనలో ఏ గ్రామంలో చూసినా బురుదమయమైన రోడ్లు, మురుగు, పేరుకపోయిన కాల్వలు కనిపించాయి. ఇప్పుడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో దాదాపు 80శాతం సీసీరోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేశాం. మిగిలిపోయిన సీసీరోడ్ల పనులను త్వరలో పూర్తి చేస్తాం.
– శానంపూడి సైదిరెడ్డి, ఎమ్మెల్యే, హుజూర్నగర్