స్వరాష్ట్రంలో చౌటుప్పల్ రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయి. చౌటుప్పల్తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గతంలో రూ.5 లక్షలు పలికిన ఎకరం భూమి నేడు ఏకంగా రూ.5 కోట్లకు పైగా పలుకుతున్నది. అందుకు అనుగుణంగానే ప్లాట్ల రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఎకరం భూమి ఉన్న రైతు ప్రస్తుతం కోటీశ్వరుడిగా మారగా.. ప్లాటున్న వారు లక్షాధికారులవుతున్నారు. హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లినగ్రామీణ ప్రాంత ప్రజలు తిరిగి పల్లెలకు తిరుగుపయనమవుతున్నారు. వారు భూములు కొనుగోలు చేసి సాగు చేసుకునేందకు ఆసక్తి చూపుతుండడంతో ధరలు పెరిగి పోతున్నాయి.
చౌటుప్పల్ పట్టణంలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గత ఐదేండ్ల క్రితం రూ.30 లక్షలున్న ఎకరం ప్రస్తుతం రూ.4 నుంచి 5 కోట్లకు ఎగబాకింది. సమీప గ్రామాల్లోని భూముల ధరలు భారీగా పెరిగాయి. గతంలో దామెర, తంగడపల్లి, చిన్నకొండూరు, పెద్దకొండూరు, కొయ్యలగూడెం, డి.నాగారం తదితర గ్రామాల్లో రూ.5 లక్షల నుంచి 10 లక్షలున్న ఎకరం ధర నేడు ఏకంగా రూ.50 లక్షల నుంచి 2 కోట్లు వరకు పలుకుతుంది. చౌటుప్పల్ శివారు గ్రామాల్లోనూ ఎకరం రూ. 50 లక్షలకు తగ్గకుండా ధర పలుకుతుంది.
ప్రభుత్వం చౌటుప్పల్ మీదుగా రీజినల్ రింగ్ రోడ్డు ప్రపోజల్ చేయడంతో భూముల ధరలు మరింతగా పెరుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ చౌటుప్పల్ మీదుగా వెళ్తుందన్న సమాచారంతో హైదరాబాద్తో పాటు చుట్టు పక్కల జిల్లాల, రాష్ర్టాల ప్రజలు ఇక్కడ భూముల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల వారు చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం మం డలాల్లో భూములు కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్కు సమీపంగా ఉండడంతో పాటు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రియల్ రంగం జోరందుకోవడంతో ఇక్కడి భూముల కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. ఒక్కొక్కరు ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు కొనుగోలు చేస్తున్నారు.
చౌటుప్పల్లో ఖాళీ ప్లాట్ల ధరలు సైతం అమాంతం పెరిగాయి. రెండు, మూడేండ్ల క్రితం రూ. 5 వేలున్న గజం ధర ప్రస్తుతం 20 నుంచి 25 వేలు పలుకుతుంది. ఇక షెట్టర్ ధరల పెరుగుదల ఎవరూ ఊహించని విధంగా ఉంది. తంగడపల్లి రోడ్డుతో పాటు వలిగొండ రోడ్డు, చిన్నకొండూరు రోడ్ల వెంట షెట్టర్ ప్లాట్లకు భలే డిమాండ్ ఏర్పడింది. రూ.5 నుంచి 10 లక్షలున్న షెట్టర్ ధర ప్రస్తుతం రూ.50 లక్షల పైచిలుకుకు చేరుకుంది. చౌటుప్పల్లో 200 గజాల ప్లాటున్న వారు లక్షాధికారులు కాగా..ఒకటి, రెండు షెట్టర్లున్న వారు కోటీశ్వరులుగా మారారు. చౌటుప్పల్ శివారులోనూ గజం ధర రూ.8 నుంచి 10 వేలు పలుకుతున్నది.
చౌటుప్పల్లో భూముల ధరలు అమాంతం పెరిగాయి. గతంలో ఎకరం 20 నుంచి 30 లక్షలుంటే ఇప్పుడు కోట్లలో పలుకుతున్నది. శివారు గ్రామాల్లోనూ భూముల ధరలు కోటి నుంచి 2 కోట్లు పలుకుతున్నాయి. రీజినల్ రింగ్ రోడ్డు ప్రపోజల్తో భూముల ధరలు మరింతగా పెరుగుతున్నాయి.
– సుర్వి అంజయ్యగౌడ్, తాళ్లసింగారం
చౌటుప్పల్లో ప్లాట్ల ధరలు బాగా పెరిగాయి. షెట్టర్ ధరలు ఎవ్వరి ఊహలకందని రీతిలో పెరుగుతున్నాయి. గతంతో 5 వేలున్న గజం ప్రస్తుతం 20 నుంచి 25 వేల వరకు పలుకుతుంది. ఇక్కడ ఒక్క ప్లాటున్న వారు లక్షాధికారులుగా మారగా.. రెండు షెట్టర్ మడిగలున్న వారు కోటీశ్వరులయ్యారు.
– కొయ్యడ శేఖర్గౌడ్, తంగడపల్లి