రామన్నపేట, జూన్ 25 : అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం ఆయన మండలంలోని ఎన్నారం గ్రామంలో రూ.20లక్షలతో చేపడుతున్న సీసీరోడ్డు పనులు ప్రారంభించారు. పలు వార్డుల్లో తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రైతులు, సబ్బండ వర్గాల సంక్షేమానికి అనేక పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్సేనని పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.17వేల కోట్లతో రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నదన్నారు. ఈ నెల 28నుంచి ప్రతి రైతు ఖాతాలో రైతుబంధు డబ్బులు జమ కానున్నాయని తెలిపారు.గ్రామంలో నిర్మించతలపెట్టిన ఆంజనేయ స్వామి గుడికి రూ.2.16లక్షలు ఇస్తానని హామీనిచ్చారు. అదేవిధంగా రామన్నపేట మండల కేంద్రానికి చెందిన నిజామొద్దీన్(రిజ్వాన్)కు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.52వేల చెక్కును క్యాంపు కార్యాలయంలో అందించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పోతరాజు సాయికుమార్, ఎంపీటీసీ నర్సింహ, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండీ.ఆమేర్, మైనార్టీ సెల్ మండలాధ్యక్షుడు మీర్జా ఇనాయతుల్లాబేగ్ పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన నచ్చి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఎన్నారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సామ సుధాకర్రెడ్డి సహా 55మంది ఆ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు.
వారికి ఎమ్మెల్యే వేర్వేరుగా గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పాత, కొత్త తేడా లేకుండా కార్యకర్తలందరూ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. సర్పంచ్ మెట్టు మహేందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, తాసీల్దార్ ఆంజనేయులు, ఎంపీటీసీలు ఏనుగు పుష్పావెంకట్రెడ్డి, దోమల సతీష్, గొరిగే నర్సింహ, ఉపసర్పంచ్ పలసం భిక్షం, నాయకులు పున్న జగన్మోహన్, మెట్టు శ్రీనివాస్రెడ్డి, గుత్తా నర్సింహారెడ్డి, పిట్ట కృష్ణారెడ్డి, మల్లేశం, పురుషోత్తంరెడ్డి, శంకర్, మాధవరెడ్డి పాల్గొన్నారు.
భువనగిరి కలెక్టరేట్, జూన్ 25 : జిల్లాలో ప్రముఖుల పర్యటన సందర్భంగా ప్రొటోకాల్ తప్పక పాటించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రొటోకాల్ విషయాల్లో అధికారులు సమగ్రంగా వ్యవహరించాలన్నారు. ప్రముఖుల పర్యటన వివరాలు ముందస్తుగా తెలుస్తాయి కనుక ప్రొటోకాల్ను తప్పక పాటించాలన్నారు.