తుంగతుర్తి, జూన్ 23 : తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికై వందల సంఖ్యలో నూతన గురుకులాలను ఏర్పాటు చేసి విద్యను అందిస్తున్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తూ వసతుల కల్పనకు చర్యలు చేపట్టారు.
తుంగతుర్తి మండలంలోని మొత్తం 16 పాఠశాలల్లో ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సహకారంతో మౌలిక వసతులు, పలు నూతన భవనాలకు నిధుల కేటాయింపుతో పాటు అదనపు తరగతి గదులను ప్రారంభించారు. తుంగతుర్తి, వెలుగులపల్లి, వెంపటి, గొట్టిపర్తి ప్రభుత్వ పాఠశాలల్లో నూతన భవనాలకు నిధులు మంజూరు కావడంతో పనులు పూర్తి చేసుకుని కార్పొరేట్కు దీటుగా నిలిచాయి.
విశాలమైన భవనాలు, ప్లే గ్రౌండ్స్, పచ్చని చెట్లతో పాఠశాలలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా అంతా కలిసి రావడంతో పాఠశాలలు అభివృద్ధి చెంది విద్యార్థులు, తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరుగడంపై హెచ్ఎంలు, టీచర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతంలో భాగంగా మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ కృషితో అదనపు తరగతి గదుల భవనానికి సకాలంలో నిధులు రావడం, పనులు పూర్తి కావడం ఆనందంగా ఉంది. గతేడాదితో పోల్చితే ప్రస్తుతం 50 అడ్మిషన్లు అధికంగా వచ్చాయి.
– యాకయ్య, హెచ్ఎం, తుంగతుర్తి
వెంపటి ప్రభుత్వ పాఠశాలలో ఈ ఏడాది కొత్తగా 60 అడ్మిషన్లు రావడం హర్షణీయం. పాఠశాలలో హెచ్ఎం, టీచర్లు అంకితభావంతో పని చేస్తున్నారు. పాఠశాల అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం కావడంతో ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూల్ను తలపిస్తుంది.
– అబ్బగాని పద్మ, వెంపటి సర్పంచ్