భువనగిరి కలెక్టరేట్, జూన్ 23 : తాము ఐడీ పోలీసులమని, ఫోర్జరీ కేసులో పేర్లు తొలగిస్తామని నమ్మించి డబ్బు వసూలు చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం చేపట్టిన విచారణలో పలు మోసాలు వెలుగులోకి వచ్చాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని డీసీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ కె.నారాయణరెడ్డి వివరాలు వెల్లడించారు. మూడు నెలల క్రితం ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో పసల జ్యోతి, ఆమె బంధువులైన 10మందిపై ఫోర్జరీ కేసు నమోదైంది.
ఈ విషయాన్ని వాట్సాప్ ద్వారా తెలుసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన విజయ్, యాదగిరిగుట్టకు చెందిన బడుగు సాయితేజ జ్యోతికి ఫోన్ చేసి తాము భువనగిరి ఐడీ పార్టీ పోలీసులమని నమ్మించారు. రూ.2లక్షలు ఇస్తే ఫోర్జరీ కేసు నుంచి పేర్లు తొలగిస్తామని బేరం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో లక్ష రూపాయలు అందజేసిన జ్యోతి మిగిలిన డబ్బు పని పూర్తి చేసిన తర్వాత ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నది. కొన్ని రోజులకు బాధితురాలు, వారి బంధువులు ఎఫ్ఐఆర్లో తమ పేర్లను తొలగించిన కాగితాలను ఇవ్వాలని, మిగతా రూ.లక్ష ఇస్తామని తేల్చి చెప్పారు.
డబ్బును భువనగిరి రైల్వేస్టేషన్ వద్దకు తీసుకొస్తే ఎఫ్ఐఆర్ కాపీలు ఇస్తామని నిందితులు నమ్మించారు. ఈ మాటలు నమ్మిన బాధితులు ఈ నెల 19న భువనగిరి రైల్వేస్టేషన్కు నగదుతో వచ్చారు. ఈ సమయంలో విజయ్, సాయితేజ తమ వద్ద ఉన్న డమ్మీ తుపాకులతో బెదిరించి బాధితుల వద్ద రూ.లక్ష నగదును తీసుకుని పారిపోయారు. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితులు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
యాదగిరిగుట్టలోని సాయితేజ ఇంట్లో తలదాచుకున్న నిందితులను బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. వారిని విచారించగా మరిన్ని మోసాలు వెలుగుచూశాయి. నిందితులు విజయ్, సాయితేజ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురి వద్ద నుంచి రూ.లక్షల్లో వసూలు చేసినట్లు తేలింది. హైదరాబాద్ నగరంలోని నాచారానికి చెందిన నిఖిల్ నుంచి రూ.50వేలు, దుర్గాప్రసాద్ వద్ద రూ.45వేలు, మాదాసు జోసెఫ్ వద్ద రూ.50వేలు, కోనేరు కిష్టయ్య వద్ద రూ.50వేలు వసూలు చేశారు.
మాదాను జోసెఫ్ కుమారుడి కాపురంలో తలెత్తిన వివాదంలో కేసును పరిష్కరించేందుకు రూ.12,500 వసూలు చేసినట్లు అంగీకరించారు. నిందితుల నుంచి ఒక ఎయిర్ పిస్టల్, 2 డమ్మీ గన్లు, హోండా యాక్టీవా, రెండు సెల్ఫోన్లు, పల్సర్ బైక్, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గురువారం రిమాండ్కు తరలించినట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. విలేకరుల సమావేశంలో ఏసీపీ సాయిరెడ్డి వెంకట్రెడ్డి, పట్టణ సీఐ సత్యనారాయణ పాల్గొన్నారు.