మునుగోడు, జూన్ 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందుకు అధికారులను ఆదేశించడంతో గ్రామపంచాయతీ, ఆవాసాల్లో ఆట స్థలాల ఏర్పాటుకు రెవెన్యూశాఖ అధికారులు ప్రభుత్వ స్థలాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
తెలంగాణ క్రీడా ప్రాంగణం పేరిట రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామపంచాయతీలో ఎకరం విస్తీర్ణం, ఆవాసాల్లో అర ఎకరంలో ఆట స్థలాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో ప్రాంగణంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. లాంగ్జంప్ కోసం ప్రత్యేకంగా కందకాన్ని తవ్వించి ఇసుకతో నింపనున్నారు. వీటితో పాటు వ్యాయామం కోసం సింగిల్, డబుల్ బార్లను ఏర్పాటు చేస్తారు. పచ్చదనం కోసం ప్రాంగణం చుట్టూ సుమారు 300 మొక్కలను నాటనున్నారు.
మునుగోడు మండలంలో 27 గ్రామపంచాయతీలుండగా ఇప్పటికే 16 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు అనువైన స్థలాలను రెవెన్యూశాఖ అధికారులు గుర్తించారు. ఇందులో మునుగోడు, జమస్తాన్పల్లి, కొంపల్లి, చల్మెడ, కచలాపురం, కిష్టాపురం, కోతులారం, పలివెల, ఊకొండి, సింగారం, రత్తిపల్లి, కల్వకుంట్ల, కల్వలపల్లి, పులిపలుపుల, దుబ్బకాల్వ, సోలిపురం గ్రామాలున్నాయి. ప్రస్తుతం ఈ గ్రామాల్లో కంపచెట్ల తొలగింపు, భూమి లెవల్ చేసే పనులు జరుగుతున్నాయి. మిగిలిన గ్రామాల్లో స్థలాల గుర్తింపు ప్రక్రియ జరుగుతున్నది. అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు ముమ్మరంగా పనిచేస్తున్నారు.
గ్రామాల్లో సరైన ఆటస్థలాలు లేక ఎంతోమంది యువత బీడు భూములు, పొలం గట్లపై ఆడుకుంటూ కనిపిస్తారు. క్రీడా ప్రాంగణాలు పూర్తయ్యాక వీరి సమస్యలు తీరనున్నాయి. శారీరక, మానసికోల్లాసానికి దోహదం చేసే క్రీడల పట్ల విద్యార్థులు, యువతకు ఆసక్తి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరనుంది. పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ, ఆర్మీ, తదితర పరీక్షలకు సన్నద్ధమయ్యే వారు శారీరక దృఢత్వం సాధించేందుకు వ్యాయామ బార్లు ఉపయోగపడనున్నాయి.
గ్రామపంచాయతీల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ స్థలాలు గుర్తించిన గ్రామాల్లో ఇప్పటికే పనులు చేపట్టాం. త్వరలోనే అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. క్రీడల పట్ల ఆసక్తి ఉన్న గ్రామీణ యువత, ఆటగాళ్లకు ఈ ప్రాంగణాలు ఎంతో ఉపయుక్తం కానున్నాయి.