భువనగిరి అర్బన్, మే 28 : యాసంగి ధాన్యం కొనుగోళ్లు జిల్లా కేంద్రంలో ముమ్మరంగా సాగుతున్నాయి. ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెట్టినా.. రైతులు ఇబ్బందులు పడకూడదనే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్నది. కొన్న ధాన్యానికి సంబంధించిన డబ్బులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది.
భువనగిరి పీఏసీఎస్ ఆధ్వర్యలో 5 ధాన్యం కొనుగోలు కేంద్రాలను చేసి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే 280పైగా రైతుల నుంచి 60వేల బస్తాలు కొనుగోలు చేసి సుమారు రూ.2.5 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. దాంతో పాటు ఐకేపీ ఆధ్వర్యంలో 564 రైతుల నుంచి 90,544 బస్తాల ధాన్యం సేకరించడంతో పాటు రూ.1.52 కోట్లను ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ చేశారు. పీఏసీఎస్ ద్వారా 41వేల బస్తాలు, ఐకేపీ ద్వారా 12వేల బస్తాలు తూకానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
భువనగిరి పీఏసీఏస్ ఆధ్వర్యంలో 5 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో హన్మాపురం కేంద్రంలో 90 మంది రైతుల నుంచి 15 వేల బస్తాల ధాన్యం కొనుగోలు చేసి రూ.75,72,000 రైతుల ఖాతాల్లో జమ చేశారు. తుక్కాపురంలో 72 మంది నుంచి 15 వేల బస్తాలు కొనుగోలు చేసి రూ.61,56,000 జమచేశారు. బొమ్మాయిపల్లి సెంటర్లో 58 మంది నుంచి 12 వేల బస్తాలు కొని రూ.44,20,000లక్షలు, భువనగిరి కొత్త మార్కెట్ యార్డులో 38 మంది నుంచి 12 వేల బస్తాలు సేకరించి రూ.23,52,000 రైతుల ఖాతాల్లో జమ చేశారు. బాలంపల్లిలో కేంద్రంలో 22 మంది రైతుల నుంచి 6 వేల బ్యాగులు కొనుగోలు చేశారు. అన్ని కేంద్రాల్లో కలిపి మరో 10వేల బస్తాల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయి.
ఐకేపీ ఆధ్వర్యంలో భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి, రెడ్డినాయక్తండా, బీఎన్.తిమ్మాపూర్, బస్వాపురం, నందనం, బొల్లేపల్లి, పీపీతండా, అనాజిపురం, సూరెపల్లి లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో 564 మంది రైతుల నుంచి 90,544 బస్తాలు కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.1.52కోట్లకు పైగా జమ చేశారు. మరో రూ.1.36 కోట్లు జమ చేయాల్సి ఉంది. అన్ని కేంద్రాల్లో కలిపి మరో 12,500 బ్యాగులు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయి.
రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసేందకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆయా కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర క్వింటాకు రూ.1,960 అందుతోంది. రైతులు దళారులను నమ్మి తక్కువ ధరకు విక్రయించి మోసపోవద్దు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేస్తున్నాం. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలి
-నోముల పరమేశ్వర్రెడ్డి, భువనగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్
కేంద్రం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పినా.. మా ఇబ్బందు లు తీర్చేందుకు రాష్ట్ర ప్రభు త్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యాన్ని పూర్తిగా కొంటున్నది. మా ధాన్యం మొత్తం మద్దతు ధరకు కొనడంతో పాటు బ్యాంకు ఖాతాలో డబ్బులు కూడా జమ చేసింది. మా బాధతు తీర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
-ప్రశాంత్, రైతు, హన్మాపురం
ధాన్యం కేంద్రానికి తీసుకుపోయిన మరుసటి రోజే మొత్తం కొన్నరు. నాణ్యతను బట్టి ధర నిర్ణయించి ఇచ్చినరు. బయట దళారులకు అమ్ముకుంటే అడ్డికి పావుశేరుగా కొనేటోళ్లు. ప్రభుత్వం మా ధాన్యాన్ని కొని మంచి ధర ఇచ్చినందుకు సంతోషంగా ఉంది.
-మన్నె సుమీళ, వడపర్తి