వేసవిలో పిల్లలు ఇంట్లో ఖాళీగా ఉండి టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతుంటారు. బయటికెళ్లి ఏమైనా నేర్చుకోవాలంటే అందరికీ సాధ్యపడదు. ఈ నేపథ్యంలో ఆసక్తి కలిగిన విద్యార్థులకు వివిధ అంశాల్లో ఉచిత శిక్షణనిస్తున్నది సూర్యాపేటకు చెందిన అక్షర ఫౌండేషన్.
– సూర్యాపేట అర్బన్, మే 28
సూర్యాపేటకు చెందిన యాస రామ్కుమార్ 2008లో అక్షర ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు. ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతియేటా వేసవిలో చిత్రలేఖనం, కరాటే, కోలాటం, కంప్యూటర్, నృత్యం, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, యోగా, స్పోకెన్ ఇంగ్లిష్, మ్యాథ్స్ ఓరియంటేషన్, హ్యాండ్ రైటింగ్, డ్యాన్స్, ఫ్లూట్ తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ శిబిరానికి సుమారు 590 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో నైపుణ్యం సాధించాలా శిక్షణ ఇస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పిల్లలు వీటిని సద్వినియోగం చేసుకొని రాణిస్తున్నారు.
ప్రత్యేక తరగతుల ద్వారా వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణను రోజూ ఉదయం నిర్వహిస్తున్నారు. 30 రోజులపాటు కొనసాగనున్న శిక్షణకు 590 మంది పిల్లలు హాజరవుతున్నారు. ఒక్కో అంశాన్ని ఎంచుకొని విద్యార్థులు ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారు.
ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ తరగతులతోపాటు వివిధ రకాల పోటీ పరీక్షలకు ఉచితంగా తరగతులు నిర్వహిస్తున్నారు. బాసర ఐఐటీ, పాలిటెక్నిక్ డిప్లొమా ప్రవేక్ష పరీక్షలకు అవసరమైన శిక్షణ తరగతులను ఆదివారం నుంచి ఆన్లైన్ ద్వారా నెలరోజులపాటు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని విద్యార్థులందరికీ ఉపయోగపడేలా ఏర్పాట్లు చేశారు.