యాదాద్రి, మే27 : పూర్వం నుంచి రోహిణి కార్తెను సాగు ఆరంభానికి అనుకూలమైన కాలంగా గుర్తించారు. ఈ కార్తెలో వానకాలం సాగు మొదలు పెడితే పంటల దిగుబడి బాగా వస్తుందని నమ్మకం. తెలంగాణ భౌగోళిక పరిస్థితులకు అనుకూలంగా దీనినే ఎక్కువగా అనుసరిస్తున్నారు. శాస్త్రవేతలు, వ్యవసాయాధికారులు కూడా కార్తెల ప్రకారం పంటలు వేయాలని సూచిస్తున్నారు. దీని ద్వారా వానకాలం, యాసంగి పంటల కాలాన్ని ముందుకు తీసుకొచ్చే అవకాశం ఏర్పడనుంది.
కొన్ని దశాబ్దాలుగా వర్షాలు సకాలంలో కురువకపోవడం, బావుల్లో నీరు అడుగంటి పోవడం వంటి కారణాలతో మే చివరి వారం కాదు కదా.. జూలై, ఆగస్టు తొలివారం వరకు నార్లు పోసే పరిస్థితి వచ్చింది. ఇలా చేస్తే పంట దిగుబడి ఎక్కువగా రావడం లేదు. తెలంగాణలో సెప్టెంబర్ చివరి వారం వరకు అనుకూల శీతోష్ణస్థితి ఉంటుంది. అదునుపై వర్షాలు నమోదవుతాయి. అక్టోబర్లో చలికాలం మొదలై నవంబర్ వరకు ఉష్ణోగ్రత పడిపోతుంది. జూన్ ఆఖరు, జూలై, అగస్టు తొలివారాల్లో వేసిన పంటలు, చలికాలంలో తీవ్రంగా దెబ్బతింటాయి. చీడపీడలు ఆశిస్తాయి. పూత, కంకి, సరిగ్గా ఉండదు.
దిగుబడి తగ్గిపోతుంది. ఈ పంటల కోతలు డిసెంబర్లో పూర్తవుతాయి. ఆ వెంటే రైతులు యాసంగి సాగు సిద్ధపడాల్సి ఉంటుంది. వానకాలం పంట అవశేషాలు కుళ్లిపోకముందే యాసంగి పంట ఆరంభిస్తే భూమికి సారం చేకూరదు. ఇక డిసెంబర్ చివర, జనవరిలో వేసిన యాసంగి పంటలు మే నెల మధ్యలో కోతకు వస్తాయి. ఇది రైతులకు తీవ్ర ఇబ్బందికరం. ఏప్రిల్ నుంచి వడగండ్ల వానలు పడుతాయి. మేలో వీటి తీవ్రత ఎక్కువ. ఈ నేపథ్యంలో రైతులు పంటలు నష్టపోవాల్సి వస్తుంది. ఏప్రిల్, మేలో 45 డిగ్రీలకు పైగా ఎండలు నమోదవుతాయి. ఈ పరిస్థితుల్లో వరికి నీరందించడం కష్టమవుతుంది.
మే మధ్యలో యాసంగి కోతలు పూర్తి చేసుకునే రైతులు, సేద్యం ఆరంభిస్తే, రెండు పంటలు సాగు చేసుకోవచ్చు. సన్నరకాలను సైతం గరిష్ఠంగా 150 రోజుల్లో పండిచవచ్చు. అక్టోబర్ తొలివారంలోనే పంట చేతికి వస్తుంది. మూడు వారాలపాటు భూమి ఆరబెట్టడంతో భూసారం పెరుగుతుంది. నవంబర్ తొలివారంలో యాసంగి పంట ఆరంభిస్తే 125 రోజుల్లో పంట తీయవచ్చు.
మార్చి 15వ తేదీ వరకు యాసంగి పంట సైతం చేతికి వస్తుంది. దీంతో రైతులకు వడగండ్ల బాధ తప్పుతుంది. మార్చి రెండోవారం నుంచి మే మూడో వారం వరకు వానకాలం పంట కోసం భూమిని సిద్ధం చేయవచ్చని, తద్వారా రైతులు దిగుబడితోపాటు నాణ్యమైన పంటను పొందవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.