మునుగోడు, మే 26 : ఎనిమిదో విడుత హరితహారానికి మండలంలోని వన నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేస్తున్నారు. నర్సరీల్లో విభిన్న రకాలకు చెందిన 4.05 లక్షల మొక్కలను పెంచుతున్నారు. అయితే వేసవిలో ఎండ తీవ్రతకు మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
రాష్ట్రంలోని అడవులను 24 నుంచి 33 శాతానికి పెంచే లక్ష్యంతో 2015లో సీఎం కేసీఆర్ హరితహారానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా హరితహారానికి అవసరమైన మొక్కలను సిద్ధం చేసేందుకు ప్రతి గ్రామపంచాయతీలో నర్సరీలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మండలంలో మొత్తం 27 గ్రామ పంచాయతీలున్నాయి. ఒక్కో పంచాయతీ నర్సరీలో 15వేల చొప్పున మొత్తం 4.05లక్షల మొక్కలను ఈసారి సిద్ధం చేస్తున్నారు. ఈ విడుత హరితహారంలో భాగంగా మండలంలో ఇంటికి ఆరు చొప్పున లక్ష మొక్కలను పంపిణీ చేయనున్నారు. మిగిలిన వాటిని ఎవెన్యూ, బ్లాక్ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనం, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణల్లో నాటేలా ప్రణాళిక రూపొందించారు.
పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నర్సరీల నిర్వహణ కోసం ఉపాధిహామీ పథకం ద్వారా ప్రత్యేకంగా వనసేవకులను నియమించారు. మొక్కల పెంపకంపై వీరికి తగిన శిక్షణ కూడా ఇచ్చారు. వీరు రోజుకు రెండుసార్లు మొక్కలకు నీరందిస్తూ బెడ్లలో కలుపును తొలగిస్తున్నారు. వేసవిలో ఎండ తీవ్రతకు మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు షేడ్నెట్లను సైతం ఏర్పాటు చేశారు. ఏపుగా ఎదిగిన మొక్కలను సైజుల వారీగా గ్రేడింగ్ చేస్తున్నారు. హరితహారం ప్రారంభం కాగానే బాగా ఎదిగిన మొక్కలను తొలుత నాటనున్నారు.
ఒక్కో గ్రామపంచాయతీ నర్సరీలో విభిన్న రకాలకు చెందిన 15వేల మొక్కలు పెంచేలా ఆదేశాలిచ్చాం. వేసవిలో ఎండ తీవ్రతకు మొక్కలు ఎండిపోకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. జూన్ మూడోవారంలో వర్షాలు రాగానే హరితహారంలో నాటేందుకు ప్రణాళిక రూపొందించాం. మొక్కలు నాటే ప్రాంతాలను ఇప్పటికే గుర్తించాం.
-యాకూబ్ నాయక్, ఎంపీడీఓ, మునుగోడు
వీటిలో కానుగు, గుల్మొహర్, నిమ్మ, జామ, దానిమ్మ, బొప్పాయి, వెలగ, ఫిల్త్రోఫామ్, అల్లనేరేడు, మందార, గన్నేరు, చింత, మునగ, వేప, గులాబీ, టెకోమా, చీమచింత, కలబంద, కుంకుడు, సపోటా, సీతాఫలం, ఖర్జూర, పచ్చగన్నేరు, బాదం, సుబాబుల్ మొక్కలను సిద్ధం చేస్తున్నారు.