రాష్ట్ర ప్రభుత్వం పాలన వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పులు, కొత్త చట్టాలు సత్ఫలితాల నిస్తున్నాయి. ప్రజలు
సంతోషంగా ఉంటుండగా అధికార యంత్రాంగానికి సౌలభ్యంగా మారుతున్నది. ఇప్పటి వరకు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకే పరిమితమైన ఆన్లైన్ ఆస్తిపన్ను పంచాయతీల్లో కూడా అమలు చేస్తున్నారు.
– సూర్యాపేట, మే 27 (నమస్తే తెలంగాణ)
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీ సంస్కరణల్లో భాగంగా గ్రామ పంచాయతీల్లో పన్నులను ఆన్లైన్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నులను ఆన్లైన్ చేయడం ద్వారా పన్నుల వసూలులో పారదర్శకత పెరుగడంతో పాటు సిబ్బందికి పనిభారం తగ్గుతున్నది. అంతేకాకుండా పన్నుల వసూలు శాతం కూడా పెరుగనుంది. గత ఆర్థిక సంవత్సరం నుంచి ఆస్తి పన్నులకు సంబంధించి ఆన్లైన్ చేస్తుండగా 2020-21లో జిల్లాలో 96 శాతం పన్నులు వసూలయ్యాయి. వీటిని ఆన్లైన్ చేసే ప్రక్రియ 82 శాతం పూర్తై రాష్ట్రంలోనే నాలుగో స్థానంలో సూర్యాపేట జిల్లా నిలిచింది. ఆన్లైన్ ప్రక్రియ ద్వారా పంచాయతీ సిబ్బంది ఆయా గ్రామాల్లో ప్రతి ఇంటికీ డిమాండ్ నోటీసు చేతి రాత ద్వారా ఇచ్చే రిస్క్ తప్పింది. బిల్లులు ఆన్లైన్లో పొందుపర్చడం ద్వారా పంచాయతీల్లో పన్నులు ఎంత చెల్లించారో తెలుసుకోవడానికి గంటల తరబడి రికార్డులను వెతకాల్సిన పని లేకుండా క్షణాల్లో తెలిసిపోతున్నది.
ఆస్తి పన్నుల ప్రక్రియను ఆన్లైన్ చేయడం ద్వారా సిబ్బందికి ప్రతి ఏడాది రశీదులు రాసే భారం తప్పిపోయింది. ఇప్పటి వరకు ఆయా గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఆస్తి పన్ను డిమాండ్ నోటీసు చేతి రాతతో రాసి రికార్డుల్లో పొందుపర్చి ఆయా యజమానులకు అందించేవారు. సూర్యాపేట జిల్లాలో 2.98 లక్షల ఇళ్లకు 475 మంది పంచాయతీ సెక్రటరీలు చేతి రాత ద్వారా నోటీసులు సర్వ్ చేస్తూ వస్తుండగా గతేడాది నుంచి ఆన్లైన్ చేయడం ప్రారంభమైంది. కాగా జిల్లాలో 82 శాతం ఇళ్లను ఆన్లైన్లో పొందుపర్చారు. ఈ సారి వంద శాతం పూర్తి చేయడంతో పాటు ప్రతి ఇంటికీ ఆన్లైన్ ద్వారా డిమాండ్ నోటీసులు ప్రింట్ తీసి ఇవ్వనున్నారు.
తద్వారా పంచాయతీ సిబ్బందికి పనిభారం భారీగా తగ్గిపోనుంది. ఆన్లైన్ చేసే ప్రక్రియ గతేడాది ప్రారంభించగా రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లా 82 శాతం పూర్తి చేసి నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం. ఈ ఏడాది వందశాతం పన్నుల వసూళ్లు చేయడమే కాకుండా వందశాతం ఆన్లైన్ నోటీసులు అందజేస్తామని పంచాయతీ అధికారులు చెబుతున్నారు. కాగా ఈ ఏడాది నుంచి ఆన్లైన్ నోటీసులతో పాటు పంచాయతీల్లోనే ఆన్లైన్ పేమెంట్స్ చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.
ఆస్తి పన్నుల వసూళ్ల పర్వాన్ని ఆన్లైన్ చేయడం ద్వారా జిల్లా వ్యాప్తంగా సెక్రటరీలకు రశీదులు రాసే పనిభారం తప్పింది. గతేడాది ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 96 శాతం పన్నులు వసూలు కాగా 82 శాతం ఆన్లైన్ చేయడం జరిగింది. ఈ ఏడాది ఇప్పటికే డిమాండ్ నోటీసులను ఆన్లైన్ ద్వారా ఇళ్ల యజమానులకు అందిస్తుండగా ఈ సారి వందశాతం పన్నుల వసూళ్లతో పాటు వందశాతం ఆన్లైన్ చేస్తాం.
– యాదయ్య, జిల్లా పంచాయతీ అధికారి