మునుగోడు, మే 26 : బాల్యంలో పడిన కష్టాలే ఆయన రచనలకు వస్తువులయ్యాయి. కలం నుంచి జాలువారిన అక్షర ఆయుధాలు సామాజిక సమస్యలపై చైతన్యపు గళం వినిపించాయి. ఓ వైపు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే సాహితీ రంగంలో రాణిస్తున్నారు కవి, రచయిత భూతం ముత్యాలు.
నాంపల్లి మండలంలోని తిరుమలగిరికి చెందిన భూతం ముత్యాలు తండ్రి మల్లయ్య రిక్షా కార్మికుడు. తల్లి మల్లమ్మ ఇండ్లల్లో పనిచేసేవారు. తల్లిదండ్రుల కష్టాలను స్వయంగా చూసిన ముత్యాలు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగాలనే లక్ష్యంతో పట్టుదలతో చదివాడు. విద్యనభ్యసించే క్రమంలో చేతి ఖర్చుల కోసం రిక్షా తొక్కాడు. హోటల్లో పని చేశాడు. ‘చదువుకొని ఈ పనులు ఎందుకు చేస్తున్నావ్? నీలో ఏదైనా కళ ఉంటే దాన్ని ఉపయోగించుకో’ అని ఒక వ్యక్తి సలహా ఇచ్చాడు. అప్పుడే తనలో నిగూఢంగా ఉన్న చిత్రకారుడిని మేలుకొలిపాడు ముత్యాలు. ఒక ఆర్టిస్ట్ దగ్గర బొమ్మలు గీసి వచ్చిన డబ్బుతో డిగ్రీ, బీఈడీ పూర్తి చేశాడు. 1996 డీఎస్సీలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. తాను పనిచేసిన ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అర్థమయ్యేలా గోడలపై బొమ్మలు వేసేవాడు.
మునుగోడు మండలం గంగోరిగూడెం ప్రాథమిక పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్న ముత్యాలు మరోవైపు సాహితీ రంగంలోనూ విశేషంగా రాణిస్తున్నాడు. 2004లో ‘సూర’ పేరిట రాసిన నవల దళితుల కష్టాలను కళ్లకు కట్టింది. ఆ తర్వాత పురుడు, ఇగురం, మొగలి, మాలచ్చువమ్మ నవలలు రాశాడు. బేగరి కథలు, బుగడ కథలు, దగ్ధం కథలు పేరిట మూడు పుస్తకాలను ప్రచురించాడు. దళితుల జీవనశైలి, భాష, ఆచార వ్యవహారాలపై ‘దుగిలి’ పేరిట పద్యాలను రాశాడు. ఇంకా కులాట్కం (నాటకం), నియతి (స్వీయచరిత్ర), మాండలీకం (తెలంగాణ కులవృత్తి పదకోశం), మాలవారి చరిత్ర, తదితర పుస్తకాలను రాశాడు. ముత్యాలు రాసిన గొంతు (ఒక పిలుపు), బర్రె కవితలు ఆంగ్లంలోకి అనువదించబడ్డాయి. ముత్యాలు ఇప్పటి వరకు మొత్తం 15 పుస్తకాలు రాశారు.
బాల్యంలో దిన, మాస పత్రికలు, బాలమిత్ర, చందమామ వంటివి బాగా చదివేవాడిని. దాంతో చిన్ననాటి నుంచే సాహిత్యంపై ఆసక్తి పెరిగింది. డిగ్రీ చదివేటప్పుడు గుర్రజాడ, కాళోజీ, తిలక్ వంటి వారి రచనలు ఇష్టంగా చదివా. ఉపాధ్యాయ వృత్తిలో భాగం గా విద్యార్థుల కోసం కవితలు, గేయాలు, పాటలు రాశాను. 2000 సంవత్సరంలో జరిగిన సాహిత్య సదస్సు నా సాహితీ ప్రయాణాన్ని పూర్తిగా మార్చింది.