నేను, నా వాళ్లు బాగుండాలనే వారిని చూస్తుంటాం. కానీ అందరూ బాగుండాలనే వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఈ కోవలోకే వస్తారు నకిరేకల్ పట్టణానికి చెందిన ఇద్దరు మిత్రులు. ఇబ్బందుల్లో ఉండే నిరుపేదలు, విద్యార్థులకు చేయూతనిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కట్టంగూర్(నకిరేకల్), మే 26 : నకిరేకల్ పట్టణానికి చెందిన బ్రహ్మదేవర నరేశ్ నల్లగొండ ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్గా, కర్నాటి నరేశ్ ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. 2018న నవంబర్ 8న లిటిల్ సోల్జర్స్ ట్యూషన్ పాయింట్ కోచింగ్ సెంటర్ను స్థాపించి విద్యార్థులకు దేశభక్తి విలువలు నేర్పించేవారు. వాటితోపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. పేదల కోసం ఇంకా ఏదైనా చేయాలనే ఆలోచనతో లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు. శుభకార్యాలు, ఇండ్లల్లో మిగిలిన ఆహార పదార్థాలను సేకరించి పేదలు, అనాథలకు అందజేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో జాతీయ రహదారిపై కాలినడకన సొంత రాష్ర్టాలకు వెళ్తున్న కార్మికులకు ఆహారం అందించారు. రోగ నిరోధక శక్తిని పెంచే కాడ కషాయాన్ని ఉచితంగా పంపిణీ చేశారు.
ప్రజల నుంచి పాత దుస్తులు సేకరించేందుకు నకిరేకల్ స్టేడియం సమీపంలోని రెండు చెట్లకు ఖాళీ సంచులను ఏర్పాటు చేశారు. అక్కడ హెల్పింగ్ ట్రీస్ పేరుతో ‘మీ వద్ద ఉన్న పాత దుస్తులను సంచిలో వేయండి, మీకు కావాల్సిన వాటిని తీసుకెళ్లండి’ అన్ని బోర్డును పెట్టారు. 5వేల జతల పాత దుస్తులను ఫౌండేషన్ ద్వారా చౌటుప్పల్, దురాజ్పల్లిలోని అనాథ ఆశ్రమాలకు అందజేశారు.
నిరుపేదలకు బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ చేసేందుకు 2020లో ఫ్రీ రైస్ ఏటీఎం, ఘర్ పర్ చావల్(ఇంటి వద్దకే వెళ్లి బియ్యం) కార్యక్రమాన్ని ఏర్పా టు చేశారు. ఇప్పటివరకు 600 పైగా కుటుంబాలకు బియ్యం, కూరగాయలు అందించారు.
లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను గుర్తించిన వివిధ సంస్థలు పలు అవార్డులను అందజేశాయి. మహాత్మాగాంధీ గ్లోబర్ పీస్, మదర్ థెరిసా పీస్ అవార్డు, దీన్డాన్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అవార్డు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కరోనా వారియర్స్ అవార్డుతోపాటు కాకతీయ నంది పురస్కారం అందుకున్నారు.
నిరుపేదల చిన్నారులకు ఆపన్న హస్తం అందించేందుకు లిటిల్ సోల్జర్స్@200 వాటాప్స్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. ఈ గ్రూపు సభ్యులు చిన్నారుల కోసం ప్రతి నెలా రూ.200 జమచేయాలని నిర్ణయించారు. 10 మందితో ప్రారంభమైన దీనిలో ప్రస్తుతం 130 మంది సభ్యులు ఉన్నారు. ఈ గ్రూప్ ద్వారా ఇప్పటివరకు రూ1.50 లక్షలు చిన్నారుల వైద్యానికి అందజేశారు. 500 మందికి పైగా రక్తదాతల ద్వారా రక్తం అందించారు.
లిటిల సోల్జర్స్ ఫౌండేషన్ ద్వారా పేదల అవసరాలు తెలుసుకొని సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఫౌండేషన్కు దాతలు సహాయం అందిస్తుండడంతో మాలో మరింత సేవాభావం పెరిగింది. అనాథలు, నిరుపేదలకు భోజనం, బియ్యం అందజేస్తే ఎంతో తృప్తి కలుగుతుంది. త్వరలో మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనాథ ఆశ్రమాన్ని నెలకొల్పాలనే లక్ష్యంతో ఉన్నాం.
– బ్రహ్మదేవర నరేశ్, కర్నాటి నరేశ్