చందంపేట, మే 26 : డ్రాగన్ ఫ్రూట్ సాగు మారుమాల గ్రామాల్లోనూ సాగు చేసేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. సాగు విధానం, దిగుబడి, మార్కెటింగ్ తదితర వివరాలను తెలుసుకొని పండిస్తున్నారు. దేవరకొండకు చెందిన కేఏ పూర్ణచందర్రావు అనే రైతు చందంపేట మండలంలోని గన్నెర్లపల్లిలో మూడు ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. కుటుంబ సభ్యుల సలహాతో మంచి డిమాండ్, లాభాలు ఉన్న డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపడుతున్నాడు. ఈ పండ్ల తోటకు ఎకరానికి సుమారు రూ.5 లక్షల ఖర్చు అవుతుంది. ఆరు నెలలకు పంట చేతికి వస్తుంది.
డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసేందుకు ప్రతి ఒక్కటీ ప్రత్యేకంగా చేపట్టాలి. మొక్కలు కొనుగోలు చేయాలి. పోల్స్, డ్రిప్స్ ఏర్పాటు చేయాలి. చీమలు, పురుగులు పట్టకుండా మొదటి సంవత్సరంలో ఎరువులు, మందులు పిచికారీ చేయాలి. వారానికి ఒకసారి డ్రిప్ ద్వారా నీటిని ఇవ్వడంతోపాటు నెలకోసారి ఎరువులు డ్రిప్స్ ద్వారా అందించాలి. ఆరు నెలలు పంట సాగుపై దృష్టి పెడితే కాతవస్తుంది. ఆ తర్వాత రోజూ దిగుబడి వస్తూనే ఉంటుంది. గన్నెర్లపల్లిలో పూర్ణచందర్ జనవరిలో పంట సాగు చేయగా ప్రస్తుతం పంట చేతికొచ్చే దశలో ఉన్నది.
పట్టణాలకే పరిమితమైన డ్రాగన్ ఫ్రూట్ను గ్రామీణ ప్రాంత ప్రజలకు చేరువ చేయాలని సాగు చేస్తున్నా. ఇక్కడి రైతులకు దీనిపై అవగాహన కల్పించి ఇంకా పంట విస్తరించేందుకు తోడ్పాటునందిస్తున్నా. ఈ పంట సాగుకు ఏడాది వరకు చీడ పురుగులు పట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. పంట చేతికొచ్చే వరకూ నీటితోపాటు ఎరువులు అందించాలి. ఈ పంట ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సంపాదించొచ్చు.
– కేఏ పూర్ణచందర్ రావు, రైతు, దేవరకొండ