వైద్య కళాశాలల రాకతో జిల్లాకేంద్ర దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతున్నది. ఇప్పటికే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మెడికల్ కాలేజీలకు అనుబంధంగా జిల్లా ఆస్పత్రులకు ప్రభుత్వం అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చింది. పడకల సంఖ్యను పెంచింది. అన్ని రకాల ఆపరేషన్లు, డయాలసిస్తోపాటు టీ హబ్ పేరుతో అన్ని రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తెచ్చింది. సీటీ స్కాన్, ఎక్స్రే సేవలూ ఉచితంగా అందిస్తున్నారు. మెడికల్ కాలేజీల ఏర్పాటుతో జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో వైద్య నిపుణుల సంఖ్య గణనీయంగా పెరిగి సేవలు విస్తృతమయ్యాయి.
ప్రజావైద్యం బలోపేతం దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యను సైతం సామాన్యులకు అందుబాటులోకి తెస్తున్నది. జిల్లాకో మెడికల్ కాలేజీ లక్ష్యంలో భాగంగా సూర్యాపేట మెడికల్ కాలేజీ భవన నిర్మాణం ఇప్పటికే తుది దశకు చేరుకున్నది. ఇక నల్లగొండలో మెడికల్ కాలేజీ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 4న జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితో కలిసి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పునాదిరాయి వేయనున్నారు. నల్లగొండకు ఆనుకుని ఉన్న ఎస్ఎల్బీసీలో 42 ఎకరాల్లో రూ.110కోట్లతో నిర్మాణం చేపట్టనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం జిల్లా అధికారులతో కలిసి నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో వచ్చే ఏడాది నుంచి మెడికల్ కాలేజీని అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
నల్లగొండ ప్రతినిధి, మే26(నమస్తే తెలంగాణ).స్వరాష్ట్రంలో పేదలకు మరింత మెరుగైన వైద్య సేవల కోసం ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. కార్పొరేట్ దవాఖానలకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దాలన్న సంకల్పంలో సీఎం కేసీఆర్ అనేక పథకాలకు శ్రీకారం చుట్టారు. ఇందుకు కోట్లాది రూపాయలను వెచ్చిస్తూ అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చారు. జిల్లా కేంద్ర ఆస్పత్రులపై ప్రత్యేకంగా దృష్టి సారించి అత్యాధునిక వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్స్ సేవలను అందిస్తున్నారు.
ఇదే సమయంలో జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తూ విప్లవాత్మక నిర్ణయాలు చేపట్టారు. అందులో భాగంగా మూడేండ్ల కిందటే నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు ఒకసారి మెడికల్ కళాశాలను మంజూరు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దాంతో ప్రస్తుతం అటు సూర్యాపేట, ఇటు నల్లగొండలో మెడికల్ కళాశాలలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రెండో ఏడాది తరగతులూ రెండు చోట్ల నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది తృతీయ సంవత్సరం తరగతులకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మూడో బ్యాచ్ ఈ కాలేజీల్లో వైద్య విద్యం కోసం వచ్చే మూడు నెలల్లో రానుంది. మరోవైపు యాదాద్రి జిల్లాలో ఇప్పటికే ఎయిమ్స్ ద్వారా వైద్యసేవలు అందుబాటులోకి వచ్చినా, ప్రత్యేకంగా మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల యాదాద్రి కలెక్టరేట్ ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ వచ్చే ఏడాది మెడికల్ కాలేజీని ప్రారంభిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో మూడు జిల్లాలకు మూడు మెడికల్ కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారా జిల్లా కేంద్ర ఆస్పత్రులకు మహర్దశ చేకూరుతుంది. ఇప్పటికే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఆస్పత్రులను అత్యాధునిక వైద్య పరికరాలతో తీర్చిదిద్దారు.
రోగుల రాకకు అనుగుణంగా పడకల సంఖ్యను పెంచుతూ అన్ని రకాల ఆపరేషన్ల నిర్వహణతో పాటు డయాగ్నస్టిక్స్ సేవలను అందిస్తున్నారు. ప్రత్యేకంగా టీ హబ్ పేరుతో అన్ని రకాల వైద్య పరీక్షల నిర్వహణను చేపడుతున్నారు. మెడికల్ కాలేజీల ఏర్పాటుతో జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో వైద్య నిపుణుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దాంతో అన్ని రకాల వైద్యసేవలు నిరంతరం అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు కేసీఆర్ కిట్స్తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇలాంటి అనేక చర్యలతో సర్కార్ వైద్యంపై ప్రజల నుంచి ప్రశంసల జల్లు కురుస్తున్నది
సూర్యాపేట మెడికల్ కాలేజీ నూతన భవన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కాగా ఫినిషింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జగదీశ్రెడ్డి మెడికల్ కళాశాల భవనాన్ని సందర్శించి పనుల పురోగతిపై సమీక్షించారు. దసరా నాటికి కాలేజీ భవనాన్ని అన్ని హంగులతో సిద్ధ్దం చేసి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అందుబాటులోకి తేనున్నట్లు తెలిసింది. ఇక నకిరేకల్ వైపు నుంచి హైవేపై సూర్యాపేట పట్టణంలోకి ప్రవేశిస్తుంటే మెడికల్ కాలేజీ భవనం పట్టణానికే కొత్త శోభ సంతరించుకున్నట్లుగా రూపుదిద్దుకుంటుంది.
జూన్ 4న నల్లగొండ మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, స్థానికఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి భవన నిర్మాణానికి హరీశ్రావు పునాదిరాయి వేయనున్నారు. నల్లగొండ పట్టణానికి ఆనుకుని ఉన్న ఎస్ఎల్బీసీలో విశాలమైన 42 ఎకరాల స్థలాన్ని మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి ఇది వరకే ప్రభుత్వం కేటాయించింది. భవన నిర్మాణం కోసం ఇప్పటికే డిజైన్ ఖరారు చేసి రూ.110 కోట్ల తో టెండర్లను సైతం పూర్తి చేశారు. దాంతో శంకుస్థాపన అనంతరం చకచకా నిర్మాణ పనులు కొనసాగనున్నాయి. సాధ్యమైనంత వేగంగా భవన నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రథమ, ద్వితీయ సంవత్సర తరగతులు ప్రస్తుతం జిల్లా కేంద్ర ఆస్పత్రి ఆవరణలోని ప్రత్యేక భవనంలో కొనసాగుతున్నాయి. అయితే ఈ ఏడాది తృతీయ సంవత్సరం తరగతులు కూడా ప్రారంభించాల్సి ఉన్నది. దాంతో రానున్న కాలంలో వచ్చే ఇబ్బందులను అధిగమించేందుకు భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు.
నల్లగొండ మెడికల్ కాలేజీ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సారథ్యంలో ఇందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. సాగర్ రోడ్డులోని ఎస్ఎల్బీసీలో కాలేజీ భవనం శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే స్థలాన్ని చదును చేసే పనులకు శ్రీకారం చు ట్టారు. జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, కమిషనర్ రమణాచారితో కలిసి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి గురువారం ఎల్ఎస్బీసీలో స్థలాన్ని పరిశీలించారు.
శంకుస్థాపన ఏర్పాట్లపై సమీక్షించారు. భూమిపూజ అనంతరం అక్కడే బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభవేదిక, శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లపై చర్చించారు. మెడికల్ కాలేజీ భవన నిర్మాణ కార్యక్రమాన్ని ఘన ంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. త్వరలోనే శాశ్వత భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రకటించారు. దీంతో మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి రావడంతో పాటు పేద పిల్లలకు సైతం వైద్య విద్య అందుబాటులోకి రానుందన్నారు. ఇది కేవలం సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందని కొనియాడారు.